చంద్రుల చక్రవ్యూహంలో ప్రధాని మోడీ..!

posted on: Jun 27, 2017 4:41PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఏమంత సానుకూల వాతావరణం లేదు.  ఓటుకు నోటు కేసు ఈ గ్యాప్‌ను ఇంకా పెంచింది. అయితే అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్, ఆయుత చండీయాగానికి చంద్రబాబు వెళ్లడంతో ఇద్దరి మధ్య వైరం కాస్త తగ్గింది..ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో మళ్లీ చంద్రులు కలిసింది లేదు. ఏ సమస్య పరిష్కారమైనా..కాకపోయినా వీరిద్దరికి ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంది. విడి విడిగా ప్రయత్నిస్తే లాభం లేదనుకున్నారో ఏమో కానీ ఇద్దరూ ఒక్క మాటపై నిలబడ్డారు. అంతేకాదు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ స్కెచ్‌ గీస్తున్నారు.

 

ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై చంద్రులిద్దరూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రధానిపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నియోజకవర్గాల పెంపు బిల్లును కేంద్ర న్యాయశాఖ ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ, ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్..రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సమయంలో చంద్రబాబును కలిసి వెంటనే ఈ వార్తను ఆయన చెవిలో వేశారు.

 

సీట్ల పెంపుపై తాను ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలని, రాజ్యాంగ కారణాలని ఏవేవో సాకులు చెప్పి వాయిదా వేస్తున్నారని బాబుతో అన్నారట. తాను కూడా ప్రయత్నిస్తున్నానని..ఈ సారి మోడీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి లేవనెత్తాలని కేసీఆర్ సూచించారట చంద్రబాబు. ఇలా ఉమ్మడి వ్యూహంతో మోడీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు చంద్రులు పావులు కదుపుతున్నారు. మరి మోడీ వీరి ఎత్తుకు పై ఎత్తు వేస్తారో లేక చంద్రవ్యూహంలో ఇరుక్కుంటారో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...