త్వరలో తెలంగాణాలో చంద్రబాబు పర్యటన
posted on: Jan 20, 2015 2:24PM
.jpg)
వచ్చే నెలలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి వరంగల్లో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు యల్. రమణ తెలిపారు. ఇప్పటికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిత్యం ఏదో ఒక అంశం మీద ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొంటారని భావించలేము. కానీ వైకాపా నాయకురాలు వై.యస్.షర్మిల పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు అన్ని జిల్లాలు చుట్టబెట్టేస్తున్నప్పుడు నోరు విప్పని తెరాస నేతలు, వారి అధ్యక్షుడు కేసీఆర్, ఒకవేళ చంద్రబాబు నాయుడు పర్యటనలో ఏమయినా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారిని చంద్రబాబు నాయుడు ఇదే ప్రశ్న అడగవచ్చును.
ఆయన వెంట నారా లోకేష్ కూడా బయలుదేరినట్లయితే బహుశః మున్ముందు అతనికే తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చును. ఎందువలన అంటే ఆంధ్రాలో తెదేపాను, ప్రభుత్వాన్ని నడిపేందుకు చంద్రబాబు, ఆయనతో బాటు బలమయిన నాయకులు అనేకమంది ఉన్నారు. కానీ తెలంగాణాలో తెరాస ఒత్తిళ్లను తట్టుకొని పార్టీని నడిపించేందుకు ఎవరూ లేరు. ఉన్నకొద్ది మంది నేతల మధ్య సరయిన సమన్వయము లేకపోవడంతో వారందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి తెలంగాణాలో తెదేపాను ముందుండి నడిపించే బలమయిన నాయకుడు లేడు. గత కొన్ని నెలలుగా నారా లోకేష్ తరచూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అతని ప్రభుత్వంపై ట్వీటర్ లో విమర్శలు గుప్పిస్తుండటం గమనించినట్లయితే, అతని దృష్టి తెలంగాణాపైనే ఉందని అర్ధమవుతుంది.
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు ఆ పార్టీ నేతలు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కనుక తెలంగాణాలో బలపడేందుకు తెదేపా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకోక తప్పదు. ఆ ప్రయత్నాలేవో ఇప్పటి నుండే మొదలుపెడితే గానీ ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకోవడం సాధ్యం కాదు. గనుకనే చంద్రబాబు నాయుడు, ఆయనతో బాటు నారా లోకేష్ ఇద్దరూ ఈ యాత్రకు సిద్దమవుతున్నారనుకోవలసి ఉంటుంది.




.jpg)

.webp)



