Latest News
ఇక గూగుల్ హ్యాంగ్ ఔట్లో చంద్రబాబు
posted on: Oct 11, 2014 2:46PM
.jpg)
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఐప్యాడ్ లను ఉపయోగిస్తూ ‘పేపర్ లెస్ క్యాబినెట్ మీటింగ్’ నిర్వహించి తన ప్రత్యేకత మరోసారి చాటుకొన్నారు. దానికి క్లౌడ్ కంప్యూటర్ సర్వీస్ సేవలుపయోగించుకోవడం మరో విశేషం.
ఇక ఇప్పటికే ఆయన ట్వీటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో అభిప్రాయాలు పంచుకొంటున్నారు. ఇకపై యూ ట్యూబ్, ఫేస్ బుక్, గూగూల్ ప్లస్ ద్వారా కూడా యువతరంతో అభిప్రాయలు పంచుకొబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడినపుడు తీసిన వీడియో క్లిప్పింగులను, శుక్రవారం నుండి యూ ట్యూబ్ లో ఉంచుతూ దానిపై ప్రజల నుండి వచ్చే స్పందన తెలుసుకొంటున్నారు. అదేవిధంగా డిశంబరు మొదటి వారం నుండి ఆయన గూగూల్ హ్యాంగ్-అవుట్ ద్వారా కూడా నేరుగా ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోబోతున్నారు. మొదటగా తన ప్రభుత్వం చేప్పట్టిన ఏడు మిషన్లపై చర్చతో ఆరంభించే అవకాశం ఉందని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.
చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా ప్రజలతో నిత్యం ‘టచ్చు’ లో ఉండటమే కాకుండా అన్ని మంత్రిత్వ శాఖలను, మంత్రులను కూడా శాఖలవారిగా ప్రత్యేక వెబ్ సైట్స్ మరియు ఫేస్ బుక్, ట్వీటర్ ల ద్వారా ఇదేవిధంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ప్రజాస్పందన ఏవిధంగా ఉందనే సంగతి తెలుసుకోవడానికి ఎన్నికల వరకు భజన చేస్తూ కూర్చోవడం కంటే, ఈవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకొంటూ, వారి సలహాలు, సూచనలు తీసుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరికీ అమోదయోగ్యమయిన విధంగా పరిపాలనా సాగించవచ్చని, తప్పులు జరిగితే తక్షణమే వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు.



.jpg)


