చంద్రబాబుకి గుడి.. వెండి విగ్రహం..
posted on: Jan 25, 2018 11:17AM
.jpeg.jpg)
సాధారణంగా సినిమా వాళ్లకి అభిమానులు గుడి కట్టడం చూశాం. మన తెలుగులో తక్కువ కానీ..తమిళనాడులో ఖుష్బూకి దేవాలయం కట్టారు. ఆ తరువాత నమిత, నయనతారకు కూడా గుడి కట్టాలని అనుకున్నారు. అయితే ఇది సినిమా పరిశ్రమ వరకే సాధ్యం. కానీ రాజకీయాల్లో ఓ వ్యక్తికి గుడి కట్టాలని అనుకోవడం చాలా గొప్ప విషయమే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబుకు గుడి కట్టేది ఎవరనుకుంటున్నారా..? వారెవరో కాదు హిజ్రాలు.. హిజ్రాలు ఏంటి.. చంద్రబాబుకు గుడి కట్టడం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...
హిజ్రాలంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో వారిపై అందరికీ చిన్నచూపే ఉంటుంది. అందుకే వూరికే వారి మీద చిరాకు పడుతుంటారు. ఇక వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆలోచిస్తుంటారు. అందుకే ఏం చేయలేక వారు అడుక్కునే పరిస్థితి వారిది. అలాంటి వారికోసం ఏపీ ప్రభుత్వం చేయూత నిచ్చింది. వారికోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వారికి రేషన్ కార్డ్, ఇళ్లు, ప్రతి నెల రూ. 1500 పింఛను, చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో చంద్రబాబుపై హిజ్రాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం నాయకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని.. అందుకే ఆయనకు గుడిని నిర్మించాలనుకుంటున్నామని అన్నారు. నంద్యాల నుండి మహానంది వెళ్లే దారిలో గుడిని నిర్మించాలనుకుంటున్నామని... ఇప్పటికే స్థలం కూడా సేకరించామని.. ఆలయంలో వెండి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి రాజకీయ నేతలంటే తమ స్వార్ధం మాత్రమే చూసుకుంటారు అన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. ఓ నేతకు గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి చంద్రబాబులాంటి వ్యక్తులు దానికి అతీతంగా ఉండటం ఆనందించాల్సిన విషయమే.






.webp)



