వారంలో ఒకరోజు తెలంగాణాకు: చంద్రబాబు

posted on: Jun 6, 2014 3:05PM

 

ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా తెలంగాణా శాసనసభ్యుల సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. తెదేపా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించినప్పటికీ, తెలంగాణాలో ఓడిపోవడంతో డీలాపడిపోయున్న పార్టీ తెలంగాణా నేతలలో చంద్రబాబు దైర్యం, ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. తాను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలతో తీరికలేకపోయినప్పటికీ వారంలో ఒక రోజు తెలంగాణాకి, పార్టీకే పూర్తిగా కేటాయిస్తానని చెప్పారు. అంతే గాక ఇదివరకు కంటే ఇకపై తరచుగా తెలంగాణాలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రా, తెలంగాణాలు రెండుగా విడిపోయినప్పటికీ తనకు రెండూ కూడా రెండు కళ్ళతో సమానమని, అందువల్ల రెండు రాష్ట్రాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టి రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటూ, ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలని ఆయన వారిని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపడుతోంది గాబట్టి, అక్కడ నేతలు పూర్తి ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు. కానీ తెలంగాణాలో మరో ఐదేళ్ళ వరకు అధికారానికి దూరంగా ఉంటూ, అధికార తెరాస ఒత్తిళ్లను తట్టుకొంటూ నిలబడటం సామాన్య విషయమేమీ కాదు. పైగా ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా పార్టీ రెండు రాష్ట్రాల మధ్య విడిపోయి తెలంగాణాలో చాల బలహీనంగా ఉంది. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణాలో పార్టీని బలంగా నిలబడేలా చేయడం చాలా అవసరం. అందుకే చంద్రబాబు వారికి దైర్యం, ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేసారు. తెలంగాణాలో పార్టీ అధ్యక్షుడిగా యల్. రమణను నియమిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అదే నిజమయితే, ఇకపై ఆయనే పార్టీ సీనియర్లందరినీ కలుపుకొని, పార్టీని మరింత పటిష్టపరుచుకోవలసి ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...