కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్ గ్రేషియా రూ.2లక్షలు
posted on: Nov 1, 2025 5:05PM

కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్క్ గ్రేషియా ప్రకటించింది. కాగా కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అలాగే క్షతగాత్రులకు రూ. 50 వేలు నష్టపరిహారం ప్రకటించింది. కార్తిక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి పది మంది మరణించిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరో వైపు కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన స్వయంగా కాశీబుగ్గకు బయలుదేరారు. ఇప్పటికే అక్కడకు పలువురు మంత్రులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘటనాస్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో పర్యటిస్తుండగా ఆయన స్వంత జిల్లా శ్రీకాకుళంలో జరిగిన ఈ సంఘటన సమాచారం తెలిసింది. వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని కాశీబుగ్గకు పయనమయ్యారు.
ఇలా ఉండగా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత . వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని శ్రీకాకుళం పయనమయ్యారు. హోంమంత్రి అనిత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.


.webp)
.webp)


