అంతర్రాష్ట్ర సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు

posted on: Feb 12, 2026 7:36PM

 

ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ నగరానికి వచ్చిన యువత ఉద్యోగాలు లేవంటూ బాధపడుతుంటే… ఓ మహానుభావుడు మాత్రం కొత్త రకం ‘స్టార్టప్’ మొదలుపెట్టాడు. పనీపాట లేక అవారాగా తిరిగే పోకిరీలను ఎంపిక చేసి… “రోజుకు వెయ్యి రూపాయలు… ఫుల్ మీల్స్… ఫ్రీ అకమోడేషన్…” అంటూ ఆఫర్ ఇచ్చాడు. వినడానికి బాగానే ఉంది 

కదా! కానీ జాబ్ ప్రొఫైల్ వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇంత కేర్ తీసుకునే ‘బాస్’ అరుదుగా దొరుకుతాడు. చేయాల్సిన పని పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో ‘డ్యూటీ’ ఎక్కాలి. ఒంటరిగా ఉన్నవారిని గానీ, ఫోన్‌లో బిజీగా ఉన్నవారిని గానీ టార్గెట్ చేసి… చాకచక్యంగా పని పూర్తి చేయాలి.. సాయంత్రానికి ‘కలెక్షన్’ బాస్‌కి హ్యాండోవర్ చేయాలి. 

పనితీరు బాగుంటే మెచ్చుకోలు, ఆపై బోనస్.. ఇది మంచి ఉద్యోగమే కదా అని అనుకుంటున్నారా..ఇది అలాంటి ఇలాంటి ఉద్యోగం కాదండోయ్.. సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అంతర్రాష్ట్ర ముఠా...అయితే ఇటీవల మెహిదీపట్నం ప్రాంతంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీలు, టెక్నికల్ ట్రాకింగ్‌తో ఈ ‘కంపెనీ’ కార్యకలాపాలను బట్టబయలు చేశారు...

హైదరాబాదు నగరంలోని రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహదీపట్నం పోలీసులు  గుట్టురట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు, జార్ఖండ్‌కు చెందిన ఒకరు కలిపి నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.6 లక్షల విలువైన 21 ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని గోల్కొండ జోన్ డీసీపీ  జి. చంద్ర మోహన్ వెల్లడిం చారు. అరెస్టయిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ నోనియా, గౌరవ్ నోనియా, జార్ఖండ్‌కు చెందిన పరణ్ కుమార్, దేవా కుమార్‌గా గుర్తించామని అన్నారు.. ఈ ముఠాకు సూత్రధారి అయిన సాగర్ కుమార్ నోనియా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు  తెలిపారు.

వేషధారణతో మోసపూరితంగా నేరాలు

నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చి టీ స్టాల్స్, చాట్ బండార్‌లు, కూరగాయల వ్యాపారుల వేషాలు వేసుకుని రద్దీ ప్రాంతాలను గమనించడం వీరి ప్రధాన వ్యూహంగా ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని వారి చేతుల్లోని ఖరీదైన మొబైల్ ఫోన్లను లాక్కొని పరారయ్యేవారు.స్నాచింగ్ అనంతరం ఫోన్లను వెంటనే సిమ్ కార్డులు తొలగించి సాగర్ కుమార్‌ అనే నిందితుడికి అప్పగించేవారని పోలీసులు తెలిపారు. 

అతడు వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించి డబ్బులు సమకూర్చేవాడని గుర్తించారు. అయితే ఈ ప్రధాన నిందితుడి అయినా సాగర్ కుమార్‌ నేరాలకు పాల్పడుతున్న నిందితులకు ప్రతిరోజూ వెయ్యి రూపాయల చొప్పున వేతనం ఇచ్చి నేరాలకు ప్రోత్సహించేవాడని విచారణలో తేలింది. మెహదీపట్నం ఇన్‌స్పెక్టర్ ఎస్. మల్లేష్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాంబాబు నేతృత్వంలోని క్రైమ్ టీమ్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 

అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.6 లక్షల విలువైన 21 మొబైల్ ఫోన్లు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో నమోదైన స్నాచింగ్ కేసులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు.

ముఠా ప్రధాన సూత్రధారి సాగర్ కుమార్ నోనియా కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. అతడిని త్వరలోనే అరెస్ట్ చేసి మొత్తం నెట్‌వర్క్‌ను బయట పెడతామని స్పష్టం చేశారు. నగర ప్రజలు రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. మెహదీపట్నం పోలీసుల చురుకైన చర్యతో నగరంలో కొనసాగుతున్న సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాకు చెక్ పడినట్లు భావిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...