Latest News
దివ్యాంగులతో కలిసి ఒకే బస్సులో చంద్రబాబు, పవన్, లోకేష్!
posted on: Mar 18, 2026 3:12PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త అధ్యాయానికి వేదికగా నిలిచిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం బుధవారం (మార్చి 18) జరిగింది. ఈ సందర్భంగా ఒక అరుదైన అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం ఈ ముగ్గురూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సాగిన ఈ ప్రయాణంలో దివ్యాంగ లబ్ధిదారులతో వారు నేరుగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మంగళగిరి బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు పవన్, లోకేష్ లతో కలిసి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారికి అందుతున్న ప్రభుత్వ సాయం గురించి వారితో చర్చించారు. బస్సు ప్రయాణం సాగినంత మేర రోడ్డుకు ఇరువైపులా భారీగా హాజరైన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలలకు లోకేష్, పవన్ కల్యాణ్ లు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంగళగిరి జై బాబు, జై పవన్, జై లోకేష్ నినాదాలతో మార్మోగింది. కాగా ఈ ముగ్గురు అగ్రనేతలూ దివ్యాంగశక్తి పథకం లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించడం ద్వారా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనే భరోసాను కల్పించారు.
ఈ సందర్భంగా ఈ ముగ్గురు నేతలూ దివ్యాంగుల పెన్షన్లు, వీల్చైర్ల పంపిణీ, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా వీరు స్పష్టం చేశారు. ఇక బస్సు యాత్ర పెనుమాక చేరుకున్న తరువాత ఈ ముగ్గురూ అక్కడి స్థానికులతో మమేకమయ్యారు.






