ఐటీ పితామహుడు చంద్రబాబు.. జగద్గురు శ్రీశ్రీరవిశంకర్

posted on: May 21, 2026 10:12AM

బెంగళూరు నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం ఒక అద్భుతమైన రాజకీయ, ఆధ్యాత్మిక సమ్మేళనానికి   వేదికగా మారింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 వసంతాలు పూర్తి చేసుకున్న  సందర్భంతో పాటు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు, జగద్గురువు  శ్రీశ్రీ రవిశంకర్  70వ జన్మదిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమకాలీన సమాజంలో టెక్నాలజీతో పాటు మానసిక ప్రశాంతత ఎంత అవసరమో చాటిచెప్పేలా ఈ ఇరువురి  భేటీ జరిగింది.  

ఈ వేడుకల వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కేవలం   ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదనీ,  అంతకుమించిన  మానవతావాది అని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా హింసలేని సమాజం కోసం, నేటి ఆధునిక మానవుడిని పీడిస్తున్న ఒత్తిడి రహిత జీవితం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న నిరంతర కృషిని ఆయన  అభినందించారు. 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయని.. ఇండియా  కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి బలమైన, గొప్ప నాయకుడు మనకు ఉండటం వల్ల యుద్ధాల ప్రభావం తక్కువ ఉందని అన్నారు.  ప్రస్తుతం తాము ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఒక తిరుగులేని టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నామని, అయితే సమాజానికి కేవలం సాంకేతికత మాత్రమే సరిపోదని..  దాంతో పాటుగా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత కూడా  ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ మహత్తర మార్పు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తన సేవలను ఆంధ్రప్రదేశ్‌కు విస్తృతంగా విస్తరించాలని, నవ్యాంధ్రను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రీశ్రీ రవిశంకర్ సంపూర్ణ సహకారాన్ని అందించాలని  కోరారు. 

కాగా  శ్రీశ్రీ రవిశంకర్  తన ప్రసంగంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఐటీకి ఆద్యుడిగా అభివర్ణించారు.  దేశంలో ఐటీ సంస్కరణలకు నిజమైన ఆద్యుడు, పితామహుడు చంద్రబాబేనన్నారు.  నాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో, ప్రపంచ టెక్నాలజీ పటంలో సగర్వంగా నిలిపిన  ఘనత కేవలం చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్‌కే దక్కుతుందన్న ఆయన.. కొన్నేళ్ల క్రితం తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు తనను కలిశారని, ఆ సమయంలో దేశంలోని యువత ఆలోచనా విధానాన్ని మార్చడం, వారిని ఉన్నతంగా పరివర్తనం చెందించడమే తన ఏకైక లక్ష్యమని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసుకున్నారు.   ఈ రోజు అమెరికా దేశంలోని ప్రసిద్ధ నగరాలైన మేరీల్యాండ్, వర్జీనియా వంటి అగ్రశ్రేణి ప్రాంతాలు మినీ ఆంధ్రప్రదేశ్‌ను తలపి స్తున్నా యంటే దానికి కారణం చంద్రబాబు నాటిన ఐటీ బీజమేనని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...