ఉగాది తరువాత ఏపీ కేబినెట్ విస్తరణ?
posted on: Mar 3, 2026 4:38PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఉగాది తరువాత ఏక్షణంలోనైనా కేబినెట్ ఎక్స్ పాన్షన్ ఉంటుందా అంటే తెలుగుదేశం వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా కేబినెట్ లో మార్పులూ, చేర్పులతో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని దేశం వర్గాలు అంటున్నాయి.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీల నుంచి కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఆయా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో ఆయన కొందరు మంత్రుల పనితీరును విమర్శించిన సందర్భాలను ఇందుకు ఉదాహరణగా తెలుగుదేశం వర్గాలు ఉటంకిస్తున్నాయి. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి పని తీరు సంతృప్తికరంగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.





