విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం.. సీఎం చంద్రబాబుతో నౌకాదళ వైస్ అడ్మిరల్ భేటీ
posted on Nov 13, 2025 3:45PM

విశాఖ అభివృద్ధికి నేవీ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కోరారు. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన చంద్రబాబుతో నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా విశాఖ భవిష్యత్ ప్రణాళికల్లో నేవీ భాగస్వామ్యంపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ కార్యకలాపాలను సంజయ్ భల్లా ముఖ్యమంత్రికి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణ రంగంలో సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపైనా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. స్వదేశీ నౌకా నిర్మాణం, సాంకేతిక అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే విశాఖ నగరం భవిష్యత్తులో అనేక అవకాశాలకు, ప్రతిష్ఠాత్మక సంస్థలకు కేంద్రంగా మారబోతోందనీ, ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుకుంటోందనీ చెప్పిన చంద్రబాబు.. ఈ ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం, నౌకాదళం కలిసి పనిచేయాలన్నారు.
విశాఖను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగానూ, అత్యుత్తమ పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఇందుకు నౌకాదళం సహకారాన్ని కోరారు. నేవీ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన పెరిగుతుందన్నారు. నౌకాదళం చేపట్టే వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యకలాపాలకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సీఎం హామీ ఇచ్చారు.