అనిల్‌ అంబానీపై సీబీఐ కేసు..!

posted on: Aug 1, 2026 3:10PM

 

రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 31, 2026న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఈపీఎఫ్‌వోకు 1,007.55 కోట్ల అసలు నష్టంతో పాటు 808.67 కోట్ల వడ్డీ కలిపి మొత్తం 1,816.22 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2013-14 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేసింది. ఈ డిబెంచర్లలో ఈపీఎఫ్‌వో సుమారు 2,500 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు సీబీఐకి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌తో పాటు మరో మూడు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా ఈ పెట్టుబడులు చేసినట్టు సమాచారం...ఈ డిబెంచర్లు 2023 నుంచి 2024 మధ్య కాలంలో మెచ్యూర్‌ కావాల్సి ఉంది. అయితే అప్పటికి చెల్లింపులు జరగకపోవడంతో వివాదం తలెత్తింది. నిధులను మళ్లించడం, మోసపూరిత లావాదేవీలకు పాల్పడటం వంటి చర్యల కారణంగానే డిబెంచర్లపై చెల్లింపులు నిలిచిపోయాయని ఈపీఎఫ్‌వో ఆరోపించినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ పరిణామాల కారణంగా ఈపీఎఫ్‌వోకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఏమిటన్న దానిపై సీబీఐ దృష్టి సారించింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి ప్రమేయం ఉంది, మొత్తం వ్యవహారంలో ఏ విధమైన నేరపూరిత కుట్ర జరిగింది, మళ్లించిన నిధులు చివరకు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎలా వినియోగించారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, రిలయన్స్‌ గ్రూప్‌కు సంబంధించిన పలు ఇతర ఆర్థిక వ్యవహారాలపై కూడా సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది. 

వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ తదితర సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ టెలికామ్‌ (ఆర్‌టీఎల్‌)లకు సంబంధించిన వ్యవహారాల్లో సీబీఐ గతంలో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొంది. రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌కు సంబంధించిన కేసుల్లో సీబీఐ ఇప్పటివరకు నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి, ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ కేసులకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. తాజా కేసులోనూ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి, నిధుల మళ్లింపు వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల పాత్రను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

CBI case against Anil Ambani, Reliance Capital Limited, CBI, EPFO, Jio, Mukesh  Ambani 

google-ad-img
    Related Sigment News
    • Loading...