పాదయాత్రలతో పాపాలను కడిగేసుకోగలిగితే...
posted on: Mar 12, 2015 1:22PM
.jpg)
బొగ్గు కుంభకోణం కేసులో వచ్చేనెల 8న కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలని మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. ఆయనతో బాటు కుమార్ మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి పిసి.ఫారెక్, హిండాల్కో కంపెనీ, దానికే చెందిన మరో ఇద్దరు అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. 2005 సం.లో డా. మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహిస్తున్నప్పుడు, ఒడిషా రాష్ట్రంలోతలబిర-2 బొగ్గు గనులలో హిండాల్కో కంపెనీకి 15 శాతం వాటాను కేటాయించడం జరిగింది. బొగ్గు గనుల కేటాయింపులలో భారీ కుంభకోణం జరుగుతోందనే సంగతి గ్రహించిన సుప్రీంకోర్టు బొగ్గు గనుల త్రవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాదాపు 147 లైసెన్సులు రద్దు చేసి, వాటిపై విచారణ చెప్పట్టమని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుని ఏర్పాటుచేసి విచారణ మొదలుపెట్టింది. ఆ కోర్టు మొట్ట మొదటగా డా. మన్మోహన్ సింగ్ వైపే వేలెత్తి చూపడం విశేషం.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈరోజు డిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం నుండి తన యంపీలు, సీనియర్ నేతలతో కలిసి డా. మన్మోహన్ సింగ్ కి మద్దతు తెలుపుతూ ఆయన ఇంటివరకు పాదయాత్ర చేసారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “డా. మన్మోహన్ సింగ్ నిష్కళంకమయిన వ్యక్తి అని యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. అటువంటి వ్యక్తిపై సీబీఐ ఇటువంటి నిందారోపణలు చేయడం కోర్టుకి హాజరుకమ్మని నోటీసులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి మద్దతుగా ఉంటుంది. అవసరమయితే ఆయన కోసం న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్దం,” అని తెలిపారు.
డా. మన్మోహన్ సింగ్ ఎటువంటి అవినీతికి పాల్పడరని అందరికీ తెలుసు. కానీ ఆయన బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నప్పుడు అందులో జరిగే అక్రమాలకు ఆయన బాధ్యుడుకాడని చెప్పలేము. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలకు ఆయన ఆమోదముద్ర వేసి, ఇప్పుడు అందుకు తను బాధ్యుడినికానని ఆయన వాదించడం అసమంజసం. అదీగాక బొగ్గు గనుల కేటాయింపులో చాలా అవినీతి జరుగుతోందని ఆ సమయంలో ప్రతిపక్షాలు చాలా గట్టిగా హెచ్చరించాయి కూడా. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆయన ఆమోదముద్ర వేశారంటే ఖచ్చితంగా అందుకు బాధ్యత వహించాల్సిందే.
ఆయన స్వయంగా ఎటువంటి నేరమూ చేసి ఉండకపోవచ్చును. ఆ కుంభకోణంలో ఎటువంటి లబ్ది పొంది ఉండకపోవచ్చును. కానీ అవినీతి జరుగుతోందని ఖచ్చితంగా తెలిసిన తరువాత కూడా ఆయన ఆమోదముద్ర వేయడం అంటే అవినీతికి ఆమోదముద్ర వేసినట్లే. కనుక ఇటువంటి పాదయాత్రల వలన ఆయనకు అంటుకొన్న ఈ అవినీతి మసి తొలగిపోదు. పైగా ఇప్పుడు ఆయనకు మద్దతుగా సోనియాగాంధీ చేప్పట్టిన పాదయాత్ర వలన యావత్ ప్రపంచానికీ కూడా ఈ సంగతి కాంగ్రెస్ పార్టీయే స్వయంగా డప్పు కొట్టుకొని మరీ చాటింపు వేసుకొన్నట్లయింది. ఈ కుంభకోణంలో నిందితులుగా పేర్కొనబడిన ఆరుగురు వ్యక్తులు కూడా తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొంటున్నారు. మరయితే ఇన్ని వేలకోట్ల అవినీతికి పాల్పడింది ఎవరు? దేశ సంపదని అంతా బొక్కేసింది ఎవరు?




.jpg)


.webp)


