Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్పై సీబీఐ చార్జ్ షీట్.!
posted on: Jul 8, 2026 10:33AM

రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎల్ఎఫ్)కు సంబంధించిన 4 వేల 97 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మళ్లింపు కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో తొలి చార్జ్షీట్ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. రిలయన్స్ ఏడీఏ గ్రూప్కు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసుల్లో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఈ చార్జ్షీట్లో మొత్తం ఏడుగురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. వీరిలో రిలయన్స్ గ్రూప్కు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) సంస్థలతో పాటు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ మాజీ డైరెక్టర్ , సీఈఓ దేవాంగ్ ప్రవీణ్ మోదీ, మాజీ డైరెక్టర్ రవీంద్ర సోమయాజుల రావు, మాజీ డైరెక్టర్ ధనంజయ్ భగవాన్ప్రసాద్ తివారీ, ఎగ్జిక్యూటివ్ రిస్క్ ఆఫీసర్ రాజేష్ కృష్ణమూర్తి, చీఫ్ రిస్క్ ఆఫీసర్ లవ్ చతుర్వేది ఉన్నారు.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణ నిధులను రుణ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా మధ్యవర్తి సంస్థలు, అనుబంధ కంపెనీల ద్వారా రిలయన్స్ ఏడీఏ గ్రూప్లోని ఇతర సంస్థలకు మళ్లించి నట్లు దర్యాప్తులో భాగంగా సీబీఐ గుర్తించింది. ఈ చర్యల వల్ల బ్యాంకులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లగా.. సంబంధిత సంస్థలు, నిందితులకు అక్రమ లాభం చేకూరినట్లు సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో పాటు 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ రుణాల మళ్లింపు కారణంగా కన్సార్టియానికి మొత్తం 4వేల97 కోట్ల నష్టం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది.
ఈ కేసులో ఇతర డైరెక్టర్లు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా మరిన్ని అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. వారిలో రిలయన్స్ క్యాపిటల్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ ఝున్ఝున్వాలా, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ మాజీ సీఈఓ దేవాంగ్ ప్రవీణ్ మోదీ, రిలయన్స్ క్యాపిటల్ మాజీ సీఎఫ్ఓ అమిత్ బాప్నా ఉన్నారు. ప్రస్తుతం అమితాబ్ ఝున్ఝున్వాలా, దేవాంగ్ ప్రవీణ్ మోదీ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, అమిత్ బాప్నా సీబీఐ కస్టడీలో ఉన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ టెలికాంలకు సంబంధించిన మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. వీటిలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేసులో ఇప్పటికే 2026 మే 29న తొలి చార్జ్షీట్ దాఖలు కాగా, రిలయన్స్ ఏడీఏ గ్రూప్కు సంబంధించిన కేసుల్లో ఇది రెండో చార్జ్షీట్గా నిలిచింది.ఈ కేసుల దర్యాప్తును భారత సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని, సమగ్రంగా, పారదర్శకంగా, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని సీబీఐ స్పష్టం చేసింది.
Banks, Consortium, Complaints, Irregularities, Telugunews






