అంబటి రాంబాబుపై కిర్లంపూడిలో కేసు.!

posted on: Jul 16, 2026 10:29AM

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాజకీయంగా మలుపు తిరిగాయి. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది.  కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 

విషయమేంటంటే.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో  బుధవారం (జులై 16) అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..  దీనిని ముద్రగడ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ కుటుంబ నిర్ణయం ప్రకారమే, సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు, నేతలు కూడా ప్రభుత్వ లాంఛనాల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తుపాకులతో సెల్యూట్ చేస్తూ గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించేందుకు సిద్ధమైన ఏఆర్ ఎస్సై అప్పలరాజుతో పాటు ఇతర కానిస్టేబుళ్లను అంబటి రాంబాబు, ఆయన అనుచరులు   నెట్టివేశారని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉన్న తమపై దాడి చేసి తోసి వేసి తన విధులకు ఆటంకం కల్పించారని బాధితులు ఆరోపించారు.  

పోలీస్ సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు  చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు,  ఇతర వైసీపీ   కేసు నమోదు చేశారు. 

ఈ వివాదంపై రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుటుంబ సంప్రదాయాలు, వారి ఇష్టాయిష్టాలను గౌరవించకుండా బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు జరపాలని చూడటం వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఒక వర్గం వాదిస్తుండగా,  విధుల్లో ఉన్న పోలీసుల  నెట్టేయడం చట్టరీత్యా నేరమని, శాంతిభద్రతలను కాపాడాల్సిన నాయకులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని  మరి కొందరు అంటున్నారు.  

Mudragada Padmanabham Funeral Controversy, Kirlampudi Police Station FIR, YSRCP Leaders Police Push Case

google-ad-img
    Related Sigment News
    • Loading...