నా కూతురూ కాదు... ఆమె పెళ్లమూ కాదు... సాయిశ్రీ కేసులో కొత్త మలుపు

 

నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి... ప్రాణాలొదిలిన విజయవాడ చిన్నారి సాయిశ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని మాదంశెట్టి శివకుమార్‌ మీడియాకి సుదీర్ఘమైన లేఖ రాశాడు. సాయిశ్రీ, సుమశ్రీలతో తనకెలాంటి సంబంధం లేదని ట్విస్ట్‌ ఇచ్చాడు. సాయిశ్రీ అసలు తన కుమార్తే కాదన్నాడు. సుమశ్రీ కూడా తన భార్య కాదంటూ కొత్త బాంబు పేల్చాడు. పోలిన కృష్ణకుమార్‌‌కు సుమశ్రీ మూడో భార్య అన్న మాదంశెట్టి శివకుమార్‌.... సాయిశ్రీ అనారోగ్యంతో చనిపోలేదని, చంపేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సుమశ్రీ, మరికొందరు కలిసి సాయిశ్రీని చంపేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నాడు. సాయిశ్రీ మరణంపై మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తానన్న శివకుమార్‌.... హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపాడు.

 

సాయిశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్‌లో అద్దెకు దిగిందని, ఆ తర్వాత 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌లోని కృష్ణకుమార్‌ వద్దకు పారిపోయిందని శివకుమార్‌ ఆరోపించాడు. దీనిపై పామర్రు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. సుమశ్రీ, సాయిశ్రీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న శివకుమార్‌.... కేవలం మానవతా దృక్పథంతోనే పాపను పెంచానని, సాయిశ్రీ వైద్యానికి సుమారు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశానన్నారు. అయితే తన ఫ్లాట్‌లో మరో మహిళతో కలిసి సుమశ్రీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందని‌.... దీనిపై చుట్టుపక్కలవారు ఎన్నోసార్లు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫిర్యాదు కూడా చేశారన్నాడు.

 

నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి.... మరణించిన సాయిశ్రీ తీవ్ర కలకలం రేపితే.... ఇప్పుడు మాదంశెట్టి శివకుమార్ ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. అయితే మానవతా దృక్పథంతోనే వైద్యం చేయించానంటున్న మాదంశెట్టి శివకుమార్‌... సాయిశ్రీ తనకు ఏమీ కాకపోతే పాతిక లక్షలు ఎలా ఖర్చు పెడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సాయిశ్రీ తన బిడ్డే కాదంటూ కేసును కొత్త మలుపు తిప్పాడు శివకుమార్‌. మరి ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.... ఇంకెన్ని సీక్రెట్లు బయటికొస్తాయో చూడాలి.