ఆళ్ళగడ్డ ఎన్నికపై ఇ.సి. పునరాలోచన?

posted on: Apr 29, 2014 5:10PM

 

 

 

ఆళ్ళగడ్డలో వైకాపా అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆ స్థానంలో ఎన్నిక నిర్వహించడం మీద ఎన్నికల కమిషన్ రకరకాల గందరగోళాలకు తెరతీసింది. ఆళ్ళగడ్డలో ఎన్నికల నిర్వహణ మీద రోజుకోమాట చెబుతూ వచ్చి ప్రజల్ని అయోమయానికి గురించేసింది. తాజాగా ఆళ్ళగడ్డ ఎన్నిక సందర్భంగా ఈవీఎంలో శోభా నాగిరెడ్డి పేరు కూడా వుంటుందని, ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆళ్ళగడ్డకు మళ్ళీ ఎన్నిక నిర్వహించబోతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

 

అయితే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేధావి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవించిలేని మనిషి పేరును ఈవీఎంలో ఉంచడం, ఆ వ్యక్తికి ఎక్కువ ఓట్లు పడితే మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తామనడం ఈ గజిబిజి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శోభా నాగిరెడ్డి మరణంతో విషాదంలో ఉన్న ఆ నియోజకవర్గ ప్రజలు సెంటిమెంట్‌తో ఆమెకే ఓట్లు వేసే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వుంటుంది.



ఈ గందరగోళం అంతా లేకుండా శోభా నాగిరెడ్డి పేరును ఈవీఎంలో పెట్టకుండా వుంటేనే బాగుంటుందని అనుకుంటున్నారు. కాగా, ఈ విషయంలో ఎన్నికల సంఘం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తాను సృష్టించిన గందరగోళానికి తానే తెరవేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సవరించే అవకాశం వున్నట్టు సమాచారం అందుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...