ఈ ఏడాది బడ్జెట్‌‌తో సామాన్యుడికి లాభమా..? నష్టమా..?

బడ్జెట్...మామూలు అర్థంలో ఆదాయాలు, వ్యయాల లెక్కలే..కానీ సగటు భారతీయుడి దృష్టిలో దాని లెక్క వేరు. ప్రభుత్వం ఏ వస్తువుల రేటు పెంచుతుందో..వేటి ధరలు తగ్గిస్తుందో..దేనిపై ఎంత పన్ను వసూలు చేస్తారోనని వెయ్యి కళ్లతో మార్చి 1 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే బూజు పట్టిన పాత కాలపు రాజకీయ పద్ధతులకు తెరదించుతూ..ఆధునిక రాజకీయాలకు తెర లేపుతూ నరేంద్రమోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ఒక నెల ముందుకు జరిపింది. అంటే మార్చి 1 నుంచి ఫిబ్రవరి ఒకటికి.

 

 

ఎన్నో ఆశలు..ఆకాంక్షల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సామాన్యుడిచే ప్రశంసలు అందుకుందా లేదా అన్నది పరిశీలిస్తే సమాధానం చెప్పలేం అనే మాటే వినిపిస్తుంది. ఈ సారి సామాన్యుడికి భారం పడకుండా పన్ను మినహాయింపు పరిధిని పెంచుతున్నట్లు జైట్లీ ముందే ప్రకటించారు..అన్నట్లుగానే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లలో మార్పులు చేశారు.

 

 

అవేంటో ఒకసారి పరిశీలిస్తే:

* వార్షికాదాయం 2.5 లక్షలు ఉంటే ఎలాంటి పన్ను లేదు.
* రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10  శాతం పన్నును 5 శాతానికి         తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
* ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నులో అదనంగా 3 వేలు వెనక్కి
* రూ.లక్ష వరకు ఆరోగ్య భీమా
* రూ.50 లక్షల లోపు విలువైన గృహాల రుణంపై ( 35 లక్షల లోపు) అదనంగా రూ.50 వేలకు వడ్డీ మినహాయింపు
* కొత్త విద్యా సంస్థలు, విద్యలో నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంటానన్నారు.
* ఉన్నత విద్యకు ఆర్థిక సహాయ సంస్థ
* ధ్రువపత్రాలకు డిజిటల్ డిపాజిటరీ
* పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు

 

 

ఆదాయపు పన్ను మినహాయింపు అంటూ ఊరిస్తూనే నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు జైట్లీ. సిగరెట్లు, లగ్జరీ కార్లు, బైకులు, సరకు రవాణా, దిగుమతి చేసుకునే ఆభరణాలు తదితరాలపై సుంకాన్ని పెంచారు. వీటిలో ఆహార పదార్థాలు, పెట్రోలు, డీజిల్ వంటి నిత్యావసరాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు పరిధిని పెంచి మాది ప్రజల ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే కంటే..నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అదుపులో ఉండేలా గట్టి చర్యలు తీసుకుంటే సామాన్యుడికి అదే పదివేలు అని చెప్పవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu