ఫోన్ ట్యాపింగ్.. న్యూస్ ట్యాపింగ్ చెల్లుకు చెల్లు!
posted on Jan 20, 2026 1:55PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనకిలా సిట్ నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నోటీసులు జారీ కావడానికి ముందు సిద్దిపేట పర్యటనలో ఉన్న హరీష్ రావు మంత్రుల్లో వాటాల కొట్లాట జరుగుతోందనీ, మంత్రి సురేఖ పీఏ వ్యవహారం నుంచి మొదలు పెడితే తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు దలలో వాటాల అంశం వరకూ వాటాల కోసం గొడవ పడుతున్నారంటూ ఓ జాబితా ఏకరవు పెట్టారు హరీష్. అంతే కాదు.. మీరు ప్రతిదానిపైనా సిట్ వేస్తుంటారు కదా... సింగరేణి బొగ్గు కాంట్రాక్టు పనుల్లో జరిగే అవినీతిపై కూడా సిట్ వేయాలని సవాల్ చేస్తూ..సిట్ కాదు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీ కాదు.. ఈ రాష్ట్రానికి అత్యవసరంగా కావల్సింది న్యూస్ ట్యాపింగ్ మీద ఎంక్వయిరీ అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత హరీష్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ నడుస్తోంది. తమకున్న మీడియా పలుకుబడి ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎక్కువగా ఇరుక్కోకుండా ఈ పథక రచన చేసినట్టు కనిపిస్తోంది.
ఇదే అంశంలో ఇక్కడి నుంచి జగన్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం. దీంతో కారు- ఫ్యాను పార్టీలు రెండూ కలసి తెలంగాణలో ఒక అలజడి సృష్టించేందుకే.. వెంకటరెడ్డి- మహిళా ఐఏఎస్ వ్యవహారం తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. దెబ్బకు దెబ్బ తీసేలా ఈ తేనెతుట్టె కదిపినట్టు సమాచారం. ఇందుకు సర్కార్ కూడా అటు వైపు నుంచి నరుక్కొస్తోంది. తమకున్న మీడియా బలం ద్వారా.. దీన్ని తిప్పి కొట్టే యత్నం చేస్తోంది. దీంతో ఇద్దరు మీడియా అధినేతలు చెరో వైపూ చీలి.. కొట్లాడుతున్న దృశ్యం తెలంగాణలో తొలిసారి కనిపిస్తోంది.