ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి.. పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేయనుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక మరో స్థానానికి దాసుజు ప్రవీణ్ కుమార్ లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.  

వాస్తవానికి ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి చూస్తే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఇద్దరిని నిలబెట్టాలని పార్టీ అధినేత వ్యూహాత్మకంగా నిర్ణయించారు. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలనూ కలుపుకుంటే బీఆర్ఎస్ కు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తారా? లేక బీఆర్ఎస్ కా అన్న విషయంలో రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉందది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధత, ఉత్కంఠా నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.