బీఆర్ఎస్ కమిటీలు రద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం

posted on: Apr 28, 2026 10:35AM

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి పూర్వవైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం  ఉన్న జిల్లా, మండల,  గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.  

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. పరిమిత సంఖ్యలో ముఖ్య నేతల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఆయన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. పార్టీలో కొత్త రక్తాన్ని నింపాల్సిన అవసరం ఉందనీ..  అందుకే పాత కమిటీలను పక్కనపెట్టి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇకపై పార్టీలో ఎవరిని నియమించాలి, ఏ స్థాయి నేతలకు ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయం పూర్తిగా కేటీఆర్ చూసుకుంటారని పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలనీ.. తద్వారా   పార్టీ పునాదులను మరింత పటిష్టం చేయవచ్చనీ అన్నారు. ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్దపీట వేయాలని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని  ఈ సందర్భంగా కేసీఆర్  కేటీఆర్‌ ను ఆదేశించారు. 

కేటీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికయ్యే నాయకులకు శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించాలని కూడా కేసీఆర్ చెప్పారు.  పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యకర్తలను సిద్ధం చేసే బాధ్యతను కూడా కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా బలంగా పోరాడాలని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.  కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీలో ఇకపై కేటీఆర్ మార్కు స్పష్టంగా కనిపించనుంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...