యూపీలో బ్రాహ్మణులపై పార్టీల కన్ను..

posted on: Jul 15, 2016 5:17PM

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ స్థానం అత్యంత ప్రత్యేకం..దేశాన్ని శాసించాలనుకునే ఏ పార్టీకైనా ఇక్కడ స్పష్టమైన మెజారిటీ వస్తే చాలు..అలవోకగా అధికారాన్ని అందుకోవచ్చు. వచ్చే ఏడాది ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2019 ఎన్నికలలో ప్రభావం చూపనుండటంతో యూపీలో ఎలాగైనా పాగా వేయాలని జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కులానిదే పైచేయి. అలాంటిది కులాల కుమ్ములాటలకు, కుల ఘర్షణలకు రాజధాని లాంటి ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ నిర్ణయాధికారం యాదవులు, దళితులు, బ్రాహ్మణులు, ముస్లింల చేతుల్లో ఉంది. అయితే వీరందిరిలోకి బ్రాహ్మణ సామాజిక వర్గం బలమైంది. దీంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎలా కొల్లగొట్టలా..? అని అన్నీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

 

భారతదేశంలోని అతికొద్ది మంది రాజకీయ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ తన వ్యూహకర్తగా నియమించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే బ్రాహ్మణులకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానానికి ప్రశాంత్ సలహా ఇచ్చారంటే బ్రాహ్మణుల సత్తా ఎంటో తెలుసుకోవచ్చు. బ్రాహ్మణుల మద్థతును సాధించడం కాంగ్రెస్‌కు ఒక రకంగా సులభమే. ఎందుకంటే, గతంలో బ్రాహ్మణులు ఆ పార్టీ వెనుకే ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్డీ తివారీ, కమలాపతి త్రిపాఠీ, గోవింద్‌ వల్లభ్‌పంత్, శ్రీపతి మిశ్రా వంటి వారు బ్రాహ్మణులే. అందుకే సీఎం అభ్యర్థిగా ఢిల్లీకి పదిహేనేళ్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ప్రకటించింది కాంగ్రెస్.

 

బీఎస్సీ స్థాపించిన తొలి రోజుల్లో బ్రాహ్మణులను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన బీఎస్పీ అధినేత్రి మాయవతి క్రమంగా ఆ సామాజిక వర్గం ప్రాధాన్యం తెలుసుకుని దళిత పార్టీ అనే ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నించారు. 2007లో 89 మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చిన మాయవతి, 2012లో 74 మందికి ఇచ్చారు. ఈసారి కూడా ఎక్కువ మందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అధికార సమాజ్‌వాదీ పార్టీ కూడా మొదటి నుంచి బ్రాహ్మణులకు ప్రాధ్యాన్యత ఇస్తూనే ఉంది. అయితే వీరందరికంటే ముందు వరుసలో ఉంది బీజేపీ. ఎందుకంటే హిందుత్వం సామాజికంగా సంప్రదాయవాదంతో ఉంటుంది. అలాగే మత సంబంధ విషయాలు, ఆలయాల నిర్మాణం, గోవధ నిషేదం వంటి అంశాలు వారిని ఎలాగూ ఆకర్షిస్తాయి. ఇవన్నీ చాలా మంది బ్రాహ్మణులు బీజేపీకి సానుకూలంగా ఉండటానికి కారణమయ్యాయి. మొత్తం మీద యూపీలోని అన్ని పార్టీలు బ్రాహ్మణ జపం చేస్తున్నాయి. ఈ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...