Latest News
జగన్ గూటికి బొత్స?
posted on: Jul 14, 2014 5:28PM
.jpg)
కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని ఇప్పుడు పట్టించుకునేవారెవరూ లేకుండా పోయారు. చీపురుపల్లి ప్రజలు కూడా ఆయన్ని చీపురుతో ఊడ్చేయడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి పూలు అమ్మినచోట కట్టెలు అమ్మినట్టుగా వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బొత్స కూడా ఒక కారణం అని ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. భవిష్యత్తులో కూడా కోలుకునే అవకాశం కనిపించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో వుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని భావించిన బొత్స సత్యనారాయణకు టీడీపీలో చేరే అవకాశం ఎలాగూ లేకపోవడంతో బీజేపీని ఆశ్రయించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని విషయాలలోనూ అయ్యగారికున్న మంచి పేరు బాగా తెలుసుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన్ని పార్టీలో చేర్చుకోలేదు. దాంతో కొంతకాలం స్తబ్దుగా వున్న బొత్స వారు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ బతికి వుండగా ఆయనకి సన్నిహితంగా వున్న బొత్స, ఆయన చనిపోయిన కొంతకాలానికే వైఎస్సార్ మీద, ఆయన పుత్రరత్నం జగన్ మీద కామెంట్లు చేశారు. ఇప్పుడు కాలం కలసిరాకపోవడంతో జగన్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన్కి అనుకూలంగా వుండేలా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పార్టీకి కూడా బొత్స లాంటి నోరున్న నాయకుడి అవసరం వుంది. ఈ నేపథ్యంతో త్వరలో బొత్స వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.


.jpg)



