అందుకే వైకాపాలో చేరారుట!

posted on: Jun 7, 2015 12:07PM

 

ఈరోజు వైకాపాలో చేరిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైసీపీలోకి చేరామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఆమె తెలిపారు. అయితే బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం ఖాయం అయిన తరువాత తాము కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడవలసివస్తోందో స్వయంగా బయటపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏడాది పాటు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఏ మాత్రం మెరుగుదల కనబడటంలేదని, కనుకనే పార్టీని వీడవలసివస్తోంది తప్ప పార్టీవల్ల తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా అంధకారంగా కనబడుతున్నందున అటువంటి పార్టీని పట్టుకొని ఇంకా వ్రేలాడటం వలన తమ రాజకీయ భవిష్యత్ కూడా దెబ్బ తింటుందనే ఆలోచనతోనే బొత్స సత్యనారాయణ సకుటుంబ సపరివారంగా సమేతంగా వైకాపాలో చేరిపోయి తమ దారి తాము చూసుకొన్నారనే విషయం స్పష్టమవుతోంది.

 

అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకులు ఏవిధంగా ప్రవర్తిస్తారో బొత్స సత్యనారాయణ కూడా సరిగ్గా అదేవిధంగా వ్యవహరించారని ప్రజలు అభిప్రాయపడితే అందులో అసహజమేమీ లేదు. పదవీ, అధికారాలే ప్రాతిపదికన చూసుకొన్నట్లయితే, బొత్స సత్యనారాయణ చాలా సరయిన నిర్ణయమే తీసుకొన్నారని భావించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైకాపాలో చేరామని చెప్పుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెస్ టోపీ, కండువా రెండూ పక్కన పడేసి, ఆయన ఇప్పుడు వైకాపా కండువా కప్పుకొన్నారు కనుక ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని చెప్పడం సహజమే. కానీ ఇంతవరకు తనను అందలం ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు దానిని ఆదుకొని దాని రుణం తీర్చుకోకుండా వదిలిపెట్టి బయటకి వచ్చిన వ్యక్తి, వైకాపాకు మాత్రం ఏదో ఒరగబెడతారని లేదా మళ్ళీ ఎన్నికల ముందు పార్టీ మారబోరనే నమ్మకం ఏమిటి? అనే సందేహం కలుగకమానదు.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుదామని ప్రయత్నించి విఫలమయిన తరువాత వేరే గత్యంతరం లేకనే ఆయన వైకాపాలో చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఆయనకే బీజేపీలో చేరే అవకాశం కలిగి ఉంటే, బహుశః అప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడేవారేమో? కానీ ఇప్పుడు వైకాపాలో చేరడం వలన ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా తెదేపా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెపుతున్నారనుకోవలసి ఉంటుంది అంతే.

 

ఇప్పుడు రాజకీయాలలో ప్రతీ పనికి, ప్రతీ మాటకి ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. కనుక రాజకీయ నేతలు పార్టీలు మారినప్పుడు పలకవలసిన ఇటువంటి కొన్ని పడికట్టుపదాలను పలుకుతుంటారు. అది విని ప్రజలు నవ్వుకొంటారు. నవ్వితే నవ్విపోయెదురు గాక మాకేటి సిగ్గు? అని నేతలు తమ పని తాము చేసుకుపోతుంటారు. పదవి, అధికారం అనే రెంటికి తప్ప మరే సిద్దాంతాలను నమ్మని అటువంటి వ్యక్తులతోనే మన రాజకీయ వ్యవస్థ నిండి ఉంది. కనుక రాజకీయపార్టీలు కూడా వారిలో నుండే తమకు అవసరమయిన వ్యక్తిని ఎంచుకోవలసి ఉంటుంది. కనుకనే వైకాపా ఆయనను పార్టీలోకి ఆహ్వానించిందని భావించవచ్చును. కనుక వైకాపా వలన బొత్స సత్యనారాయణ లబ్ది పొందుతారా? లేక ఆయన వలన వైకాపా జిల్లాలో బలపడి లబ్ది పొందుతుందా? అనేది మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఆ సంగతి రానున్న నాలుగేళ్ల కాలంలో తేలిపోతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...