విశాఖ ఉక్కుకు రూ. 8,097 కోట్ల ఊతం!

posted on: May 1, 2026 10:27AM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్   మనుగడపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు, ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో  స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.

 ప్రస్తుతం ప్రకటించిన ఈ ప్యాకేజీలో భాగంగా  3,500 కోట్ల రూపాయలు తక్షణ వర్కింగ్ క్యాపిటల్ కింద కేటాయించనున్నారు. దీనివల్ల ప్లాంట్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు కొనుగోలు, ఇతర రోజువారీ ఖర్చులకు మార్గం సుగమం అవుతుంది. మిగిలిన నిధులను ప్లాంట్ ఆధునీకరణ,  పాత బకాయిల చెల్లింపుల కోసం వినియోగించే అవకాశం ఉంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,  ఆర్థిక శాఖలు ఇప్పటికే ప్రాథమిక అనుమతులు మంజూరు చేశాయి.

గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  సరైన పెట్టుబడి లేకపోవడం, ముడి సరుకు వ్యయం పెరగడం,  అప్పుల భారం వల్ల ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్‌లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌ను కాపాడాలని కేంద్రాన్ని పదేపదే కోరుతూ వస్తున్నాయి. తాజా ఆర్థిక ప్యాకేజీ ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కేంద్రం నుంచి అందుతున్న ఈ భారీ ఆర్థిక మద్దతు కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా, ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధుల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, మార్కెట్లో ఉక్కు అమ్మకాలను మెరుగుపరచడం ద్వారా ప్లాంట్ స్వయంశక్తితో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...