2046కి 90 ఏళ్ల బామ్మ కేసు వాయిదా... అసలేం జరిగింది?

posted on: Apr 29, 2026 8:42PM

 

చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది. ముంబాయి హైకోర్టులో జరిగిన ఓ పరువు నష్టం కేసు తాజాగా చర్చనీయాంశమైంది.90 ఏళ్ల వృద్ధురాలి పట్టుదలతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ కేసులో, విచారణను ఒక్కసారిగా 2046 సంవత్సరానికి వాయిదా వేయడం సంచలనంగా మారింది. 

అంటే, ఆమె 110 ఏళ్లు వచ్చే వరకు వేచి చూడాలన్నట్టుగా వ్యాఖ్యానించటం న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ కేసు 2015లో ప్రారంభమైంది. ముంబాయిలోని శ్యామ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వార్షిక సమావేశంలో జరిగిన ఘటనలతో మానసిక వేదనకు గురయ్యామని ఆరోపిస్తూ, 90 ఏళ్ల తరిణిబెన్, 57 ఏళ్ల ధ్వని దేశాయ్ కలిసి కొందరిపై రూ.20 కోట్ల పరువునష్టం దావా వేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 20న జరిగిన విచారణలో, ఇరుపక్షాలు రాజీకి రావాలని కోర్టు సూచించింది. ప్రతివాదులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమైనప్పటికీ, వృద్ధురాలు మాత్రం తన పట్టు వదల్లేదు. దీంతో కేసు మళ్లీ మొదటి దశకు వెళ్లింది. ఏప్రిల్ 28న తిరిగి విచారణ జరిగినప్పుడు, న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ, “మీరు ఇంత పట్టుదలగా ఉన్నప్పుడు, ఈ కేసును నిదానంగా విచారిద్దాం” అంటూ 2046కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే, ఈ నిర్ణయం ఎక్కువకాలం నిలవలేదు. మరుసటి రోజే కోర్టు తన ఉత్తర్వులను పునఃసమీక్షించింది. భావోద్వేగంలో లేదా వ్యంగ్యంగా ఇచ్చిన ఆదేశాలు ఆచరణాత్మకం కాదని గుర్తించిన ధర్మాసనం, పాత ఉత్తర్వులను రద్దు చేసింది. చివరికి, వృద్ధురాలి వయసును దృష్టిలో ఉంచుకుని కేసును త్వరగా పరిష్కరించాలని నిర్ణయించి, వచ్చే జూలై 15న తదుపరి విచారణ జరపాలని కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...