ఆలయాలలో మహిళల ప్రవేశాన్ని అపలేరు- ముంబై హైకోర్టు

posted on: Mar 30, 2016 4:43PM

 

ఆలయాలో మహిళల ప్రవేశానికి సంబంధించి ముంబై హైకోర్టు నేడు ఒక కీలకమైన తీర్పుని వెలువరించింది. ఆడవారు ఆలయాలలోకి ప్రవేశించకూడదంటూ ఎలాంటి చట్టమూ లేదని హైకోర్టు భావించింది. మగవారు వెళ్లే ప్రతి చోటుకీ, స్త్రీలు కూడా వెళ్లే హక్కు ఉందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అలా మహిళలను అడ్డుకునే సందర్భాలలో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్లదే అని పేర్కొంది. శనిశింగనాపూర్‌లోని మూలవిరాట్టు ఉండే గట్టు మీదకు స్త్రీలను అనుమతించేందుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయమంటూ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

గత కొద్ది నెలలుగా శని శింగనాపూర్‌, త్రయంబకేశ్వరం తదితర ఆలయాలలో ప్రవేశించేందుకు కొందరు మహిళలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే! భూమాత బ్రిగేడ్‌ అనే సంస్త తరఫున తృప్తి దేశాయ్ అనే కార్యకర్త ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లారు. గత వారం తృప్తి, త్రయంబకేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్టయ్యారు కూడా! ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. ఆలయాలలో మహిళల ప్రవేశానికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడ్నవీస్, ఆరెస్సెస్‌లు కూడా అనుకూలంగా ఉండటంతో... ఈ సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత తీర్పు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...