షార్ కు బాంబు బెదరింపు కలకలం
posted on Jun 16, 2025 10:50AM

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)బాంబు బెదరింపు కలకలం రేపింది. ఆదివారం (జూన్ 15) రాత్రి తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు గుర్తుతె లియని వ్యక్తుల నుంచి శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో ఉగ్రవాదులు బాంబు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వెంటనే షార్లోని భద్రతా అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి.
షార్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి. షార్లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. తీరప్రాంత రక్షణ దళాలు కూడా అప్రమత్తమై సముద్ర తీరంలో గస్తీ నిర్వహించాయి. షార్లోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. షార్ లోని ప్రతి మూలా గాలించిన అనంతరం బాంబు కాల్ ఆకతాయిల పనిగా భద్రతా దళాలు నిర్ధారించారు. షార్ ప్రాంగణం మొత్తంలో పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.