Latest News
సీఎం బడ్జెట్ ప్రసంగానికి ముందు ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదరింపులు
posted on: Mar 24, 2026 3:37PM
.webp)
ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదరింపు కలకలం రేపింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటల ముందు బాంబు బెదరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం(మార్చి 24) బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గంటల ముందు అంటే ఉదయం ఏడున్నర ఎనిమిది మధ్యలో బాంబు బెదరింపులు వచ్చాయి. తొలిత అసెంబ్లీకి, ఆ తరువాత స్పీకర్ విజేందర్ గుప్తాకు ఈమెయిల్స్ వచ్చాయి.
ఈ బెదరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అసెంబ్లీ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసెంబ్లీలో బాంబు బెదరింపు ఉత్తుత్తిదేనని తేలింది. ఈ బాంబు బెదిరింపుల వల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒకింత ఆలస్యమైంది. ఈ బాంబు బెదరింపు ఈ మెయిళ్లను సీరియస్ గా తీసుకున్న డిల్లీ పోలీసులు ఈ బెదరింపులకు పాల్పడిందెవర్న విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఒక అసెంబ్లీకే కాకుండా విధాన సభకు, ఢిల్లీ మెట్రో స్టేషన్ కు కూడా మంగళవారం (మార్చి 24) బాంబు బెదరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.
తనిఖీల అనంతరం ఈ బెదరింపులు కూడా ఉత్తుత్తివేనని తేలింది. ఇలా ఉండగా ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందిచాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. భద్రతా వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించాయి. అధికార పార్టీ మాత్రం ఈ బెదిరింపులను తీవ్రంగా ఖండించి.. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ బెదిరింపులకు కారణమైన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ నిపుణులు రంగంలోకి దిగారు.
అదలా ఉంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో మంగళవారం (మార్చి 24) 2026-27 సంవత్సరానికి రూ.1,03,700 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఢిల్లీని స్వావలంబనగా మార్చడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు సీఎం రేఖా గుప్తా తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ బడ్జెట్ లో ఆమె మహిళలకు వరాలు ఇచ్చారు. దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచిత గ్యాస్ సిలెండర్లు అందజేసేందుకు ఆమె తన బడ్జెట్ లో రూ. 260 కోట్లు కేటాయించారు. అలాగే మహిళా సాధికారత కోసం అర్హులైన మహిళలకు నెలకు రెండు వేల ఐదువందల రూపాయల సాయం అందించేందుకు 5 వేల 100 కోట్లు కేటాయించారు.


.webp)
.webp)


