డాలర్ ఆధిపత్యానికి గండి!.. అమెరికా బాండ్లకు తగ్గిన గిరాకీ

posted on: Apr 27, 2026 10:46AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అమెరికా డాలర్ నేడు సందిగ్ధంలో పడింది. గ్లోబల్ మార్కెట్‌లో డీ-డాలరైజేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా చైనా, జపాన్ వంటి అగ్రశ్రేణి దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి క్రమంగా తప్పుకుంటుండటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామంగా కాకుండా..  చాలా కాలంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న  మార్పు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం. అమెరికా విధిస్తున్న ఆంక్షల భయం, ఆ దేశ   అప్పుల భారం వంటి కారణాలతో చైనా తన పెట్టుబడులను డాలర్ల నుంచి బంగారంలోకి మార్చుకుంటోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా వద్ద ఉన్న బంగారు నిల్వలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 

మరోవైపు, అమెరికాకు అతిపెద్ద రుణదాతగా ఉన్న జపాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.  అక్కడ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్వదేశీ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఒకప్పుడు జపాన్‌లో వడ్డీ రేట్లు సున్నా శాతం ఉండటంతో, ఇన్వెస్టర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణం తీసుకుని అమెరికాలో పెట్టుబడి పెట్టేవారు దీన్నే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు. కానీ ఇప్పుడు జపాన్ ప్రభుత్వ బాండ్ల   రాబడి పెరుగుతుండటంతో..  తమ దేశంలోనే పెట్టుబడి పెట్టడం వారికి లాభదాయకంగా మారింది.  కరెన్సీ విలువను కాపాడుకోవడానికి జపాన్ తీసుకుంటున్న ఈ చర్యలు అమెరికా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన భారీ బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి నిరంతరం కొత్త బాండ్లను జారీ చేస్తూనే ఉంది. గతంలో వీటిని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్ వంటి దేశాలు పోటీ పడేవి. కానీ ఇప్పుడు ఆ దేశాలు వెనక్కి తగ్గుతుండటంతో..  అమెరికాలోని కొన్ని పెద్ద బ్యాంకులు  ప్రైమరీ డీలర్లుగా వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వం తన బ్యాంకులకే వడ్డీ చెల్లిస్తూ ఈ రుణ చక్రాన్ని నడుపుకునే దుస్థితిలో పడింది. ఇది మార్కెట్ స్థిరత్వానికి తాత్కాలికంగా తోడ్పడినా.. దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సాంకేతికంగా చూస్తే, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5 శాతం దాటిన ప్రతిసారీ ప్రపంచ స్టాక్ మార్కెట్లలో  అస్థిరత  పెరుగుతోంది. అధిక వడ్డీ రేట్లు కార్పొరేట్ సంస్థల లాభాలపై ప్రభావం చూపడమే కాకుండా, స్టాక్ వాల్యూయేషన్లను తగ్గిస్తాయి. అగ్రరాజ్యం తన జాతీయ రుణాన్ని 2025 నాటికి 35 ట్రిలియన్ డాలర్లకు పెంచుకుంది. ఈ భారీ అప్పులను ఫైనాన్స్ చేయడం రాబోయే కాలంలో అమెరికాకు పెను సవాలుగా మారనుందనడంలో సందేహం లేదు. 
ఇక డీ-డాలరైజేషన్ అంటే డాలర్ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోతుందని కాదు కానీ బ్రిక్స్  దేశాలు, గల్ఫ్ దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇది డాలర్   తిరుగులేని ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించడం మాత్రం తధ్యం. ప్రస్తుతానికి డాలర్ ఇంకా ప్రధాన రిజర్వ్ కరెన్సీగా కొనసాగుతున్నప్పటికీ..  భవిష్యత్తులో  మాత్రం ఇతర కరెన్సీలు,  బంగారంతో తన స్థానాన్ని డాలర్ పంచుకోక తప్పని పరిస్థితి వస్తుందనడంలో సందేహం లేదు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక చారిత్రాత్మక మార్పు దిశగా పయనిస్తోంది. చైనా, జపాన్ దేశాల చర్యలు డాలర్ వ్యవస్థకు ఒక హెచ్చరిక వంటివి.  అమెరికా తన ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేస్తుంది? తన అప్పుల భారాన్ని ఎలా తగ్గిస్తుంది? అనే అంశాలపైనే డాలర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భారతీయ పెట్టుబడిదారులు కూడా అంతర్జాతీయ మార్కెట్లలోని ఈ మార్పులను గమనిస్తూ తమ పెట్టుబడి వ్యూహాలను రూపొందించుకునే మార్గంలో అడుగులు వేస్తున్నారు. 

-సీతారాం కంఠంనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...