Latest News

ఇండ్లు కూల్చడం కాదు…ప్రజల భద్రతే లక్ష్యం : సీఎం రేవంత్

posted on: Mar 9, 2026 10:08PM

 

నల్ల చెరువు అభివృద్ధి చూసి చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 

రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకున్నప్పుడు ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా తాను మౌనంగా భరించానన్నారు. అయితే నల్ల చెరువు అభివృద్ధిని చూసి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం ఆ విమర్శలను ఆశీర్వాదాలుగా మార్చిందన్నారు.పేదవారిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూల్చివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ముంపు బాధితులుగా మారకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి ఒకటే సూచన ఉందన్నారు. వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.నగరంలోని చెరువులన్నింటినీ పునరుద్ధరించాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోని మహానగరాలు సమస్యలతో సతమతమవుతున్నాయని, అందుకే హైదరాబాద్‌లో ప్రకృతిని కాపాడుకుంటూ చెరువులను అభివృద్ధి చేయాలని అన్నారు.

మూసీ నది ప్రక్షాళనకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించడం, నాలాల ఆక్రమణలు తొలగించడం, రోడ్ల విస్తరణ చేపట్టడం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.హైదరాబాద్‌ను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ అభివృద్ధి చేసుకునే అవకాశం రాదని హెచ్చరించారు.

ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అవసరమైతే తల తాకట్టు పెట్టినా నిధులు సమకూర్చే బాధ్యత తనదేనని తెలిపారు.కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలు తనను నిలబెట్టారని గుర్తుచేసుకున్నారు. తనను ఆదరించిన ప్రజల కోసం అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ వెనుకాడనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...