రాజకీయశక్తిగా బీజేపీ ఎదుగుదల.. అభినవ చాణక్యుడు అమిత్ షా వ్యూహాలు

posted on: May 7, 2026 3:51PM

భారతీయ జనతా పార్టీ నేడు దేశవ్యాప్తంగా తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ ఎంతటి పాత్ర పోషించిందో, దానికి సమానమైన స్థాయిలో అమిత్   షా రాజకీయ వ్యూహరచన  పాత్ర కూడా ఉంది. రాజకీయ విశ్లేషకులు ఆయన్ని కేవలం ఒక పార్టీ నాయకుడిగా కాకుండా..  ఆధునిక భారత రాజకీయాల్లో ఒక  మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా, మోడర్న్ చాణక్యుడిగా అభివర్ణిస్తుంటారు. అమిత్ షా రాజకీయ శైలి కేవలం రాబోయే ఎన్నికల్లో గెలవడంపై మాత్రమే కాకుండా, రాబోయే దశాబ్దాల కాలక్రమాన్ని మార్చే విధంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అమిత్ షా జాతీయ స్థాయి ప్రస్థానంలో  2014   లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మలుపు.   ఊహించని విధంగా రాష్ట్రంలోని 80 లోక్ సభ స్థానాలకు గానూ బీజేపీ కూటమి 73 సీట్లు సాధించడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మోదీ చరిష్మాకు, అమిత్ షా బూత్ స్థాయి నెట్‌వర్క్ తోడవడంతో ఈ విజయం సాధ్యమైంది.  అమిత్ షా చేసిన మరో అతిపెద్ద మార్పు బీజేపీ సామాజిక పునాదులను విస్తరించడం. ఒకప్పుడు  బ్రాహ్మణ-బనియా' పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీని, బహుజన వర్గాల (ఓబీసీ) పార్టీగా ఆయన రూపాంతరం చెందించారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా..  పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు 10 కోట్ల సభ్యత్వ నమోదు లక్ష్యంతో పార్టీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సంస్థగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎన్నదగినదని చెప్పాలి.  

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అమిత్ షా అనుసరించిన వ్యూహం అత్యంత చర్చనీయాంశంగా మారింది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలు ఉన్న చోట, 2021 నాటికి ఆ సంఖ్యను 77కు పెంచడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఎన్నికలలో బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రాకపోయినా.. నాడు అది వ్యూహాత్మక విజయంగా పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు 2016 ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ అధికారపగ్గాలు చేపడుతోంది.   బెంగాల్ రాజకీయాల్లో హింసను ఎదుర్కోవడానికి కేంద్ర బలగాల సమర్థ వినియోగం, ఓటర్ల జాబితా శుద్ధి వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.

తద్వారా ఓటర్లలో ధైర్యాన్ని నింపి..  ఎన్నికల వ్యవస్థలో  మార్పులు తీసుకురావాలని  ప్రయత్నించారు.  విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమిత్ షా ప్రస్తుతం హిందుత్వ 2.0 అనే బృహత్తర ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో కేవలం అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 వంటి అంశాలతో ఉత్తర, పశ్చిమ భారతానికే పరిమితమైన హిందుత్వ భావజాలాన్ని..  ఇప్పుడు దక్షిణాది ,  ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. స్థానిక భాషలు, సంస్కృతులు,  దేవాలయాల ప్రాముఖ్యతను హిందుత్వ నినాదంతో జోడించడం ద్వారా ప్రాంతీయ అస్తిత్వాన్ని గౌరవిస్తూనే జాతీయ వాదాన్ని పటిష్టం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  అమిత్ షా కేవలం ఎన్నికల నిర్వహణ అధికారి మాత్రమే కాదు, ఆయన ఒక కథా రచయిత,  దర్శకుడిగా పార్టీ గెలుపును నిర్దేశిస్తారని పరిశీలకులు అంటున్నారు. 

పార్టీ గెలిచినప్పుడు తెరవెనుక ఉండి ప్రధానికి క్రెడిట్ ఇవ్వడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత అని ఆయన అనుచరులు చెబుతుంటారు. అయితే.. ఈ అధికార వికేంద్రీకరణ లేకపోవడం,  దర్యాప్తు సంస్థల వినియోగం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన కఠిన నిర్ణయాలు,  రాజకీయ ఎత్తుగడలు తరచూ వివాదాలకు కూడా దారితీస్తుంటాయి.  చివరిగా భారత రాజకీయం అమిత్ షా'కు ముందు.. 'అమిత్ షా తర్వాత అని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం గెలుపు గుర్రాల  ఎంపిక మాత్రమే కాకుండా.. పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల జీవితాల్లో భాగం చేయడంలో  అమిత్ షా సఫలీకృతమయ్యారనీ.. రాబోయే దశాబ్ద కాలంలో బీజేపీ ప్రస్థానం ఎలా ఉండబోతుందో, ప్రతిపక్షాలు ఎలా పుంజుకుంటాయో అనే అంశాలు అమిత్ షా వేసే తదుపరి అడుగులపైనే ఆధారపడి ఉంటాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి అమిత్ షా   భారత రాజకీయలలో తనదైన ముద్ర వేశారని చెప్పవచ్చు.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...