బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి..!

posted on: Aug 17, 2026 3:44PM

 

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!

భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ అధిష్ఠానం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్ర కమిటీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త బాధ్యతలను ఖరారు చేసింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షురాలు  సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ కమిటీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హోదా లభించింది. ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ పార్టీ ఉన్నత నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

పురందేశ్వరితో పాటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, సీనియర్ నాయకుడు రామ్ మాధవ్‌లతో సహా మొత్తం 13 మంది నాయకులకు ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు దక్కాయి.ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. 

కేంద్ర కార్యాలయ బాధ్యతలను తరుణ్ చుగ్‌కు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యకు అవకాశమిచ్చారు. సంస్థాగత జనరల్ సెక్రటరీగా బి.ఎల్. సంతోష్, జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ తమ సేవలనే కొనసాగించనున్నారు. ఈ నూతన జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖులకు చోటు లభించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఈసారి జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన డి.కె. అరుణను ఈ విడత కమిటీ నుంచి తప్పించారు.

భవిష్యత్తులో రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సంస్థాగత విస్తరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ కొత్త బృందాన్ని సిద్ధం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అనుభవజ్ఞులతో పాటు చురుకైన నాయకులకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో నూతన జాతీయ కార్యవర్గం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుందో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఈ పదవుల కేటాయింపు ఏ రకంగా దోహదపడుతుందో చూడాల్సి ఉంది.

BJP National Team, Daggubati Purandeswari, Smriti Irani, Ram Madhav, PM MODI, B.L. Santosh

google-ad-img
    Related Sigment News
    • Loading...