తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం : ఎంపీ ఈటల

posted on: Aug 7, 2026 9:16PM

 

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇటీవల రాష్ట్రానికి వచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. అదేవిధంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేశారని పేర్కొన్నారు.

బెంగాల్‌లో సాధించిన విజయాన్ని తెలంగాణలోనూ పునరావృతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధిష్ఠానం పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని ఈటల రాజేందర్ చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, గతంలో అమలులో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలను కూడా కొనసాగించకుండా తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. అందుకే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకూడదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. అదే సమయంలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, పాలనలోని లోపాలు ఇంకా ప్రజల మదిలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే అభిప్రాయం బలపడుతోందని తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను గట్టెక్కించాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ బలపడాలని ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

పాన్ షాపులు, హోటళ్లు, చౌరస్తాలు, గ్రామాలు, పట్టణాలు ఇలా ప్రజలు ఎక్కడ కలిసినా తెలంగాణ రాజకీయ పరిస్థితులపైనే చర్చ సాగుతోందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య, రైతుల సమస్యలు, అసైన్డ్ భూముల అంశం, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు వంటి ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.

ప్రజలకు నాయకత్వం వహించడం, వారిలో భరోసా కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులతో ఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వం కీలక సమీక్ష నిర్వహించిందని ఈటల రాజేందర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని, ప్రజలకు బలమైన నాయకత్వాన్ని అందిస్తూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలిపారు

BJP Mission Telangana,  MP Etela Rajender, PM Narendra Modi,  Amit Shah, Nitin Nabhi, Delhi BJP Review Meeting, Telangana Politics,Congress Government, CM Revanth Reddy
 

google-ad-img
    Related Sigment News
    • Loading...