బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు : డీజీపీ
posted on: Feb 10, 2026 3:05PM

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారన్న సమాచారం అందిన నేపథ్యంలో కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన ఉదయం 3 గంటల సమ యంలో జరిగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మహాదేవప్ప ఎలాంటి సూసైడ్ లెటర్ రాయలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని డీజీపీ తెలిపారు
మరోవైపు మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య రాజకీయ దుమారం రేపుతోంది. తాను బెదరిస్తేనే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకై సిద్దమే అన్నారు. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కారణమైన వాళ్లు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున నిలబడ్డారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాకు తెలియదని మంత్రి తెలిపారు. నా ఫోన్ నుంచి ఆయనకు ఫోన్ పోయి ఉంటే నేను దేనికైనా సిద్దమేని మంత్రి తెలిపారు. గతంలో అతడు కాంగ్రెస్ కార్యకర్త అని ఆయన తెలిపారు. అనవసరంగా మాపై తప్పుడు నిందలు వేస్తున్నారని మంత్రి వెల్లడించారు. మహదేవ్కు బీజేపీ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై బాధ్యులపై కేసు నమోదు చేయాలని టీ బీజేపీ చీఫ్ రామ్చందర్రావు తెలిపారు.






