నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల నియామకం

posted on: May 28, 2026 3:10PM

భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు రాష్ట్రాలకు  కొత్త సారథులను ప్రకటించింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.  ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా,  ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు.  

రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ  మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి, తూర్పు ఢిల్లీ  ఎంపీ హర్ష్ మల్హోత్రా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఎంపీగా గెలుపొందిన హర్ష్ మల్హోత్రా.. ప్రస్తుతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు,   రవాణా,  రహదారుల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు.  అలాగే  పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేవల్ సింగ్ థిల్లాన్‌కు అప్పగించారు. గతంలో 2012 నుండి 2017 వరకు బర్నాలా నియోజకవర్గం నుండి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన థిల్లాన్, 2022 జూన్ 4న బీజేపీలో చేరారు. శిరోమణి అకాలీదళ్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పంజాబ్‌లో ఒంటరిగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి, థిల్లాన్ అనుభవం,  క్షేత్రస్థాయి వ్యూహాలు ఎంతగానో కలిసి రానున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.    హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్సురాలిగా  సీనియర్ మహిళా నాయకురాలు డాక్టర్ అర్చనా గుప్తాను కమలం అధిష్ఠానం నియమించింది.

ఇక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రాయ్‌ను ఎంపిక చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాతాబారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అభిషేక్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును మరింత బిగించడానికి కృషి చేయనున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...