ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్‌ ఉంటే బీజేపీ టికెట్‌ తేలిక

posted on: Mar 17, 2016 2:46PM

 

త్వరలో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహపడుతూ ఉండవచ్చుగాక. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన ఓ ప్రకటన విన్న తరువాత వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి. బీజేపీ నేతలలో శాసనసభలో ఉండాలనుకునేవారికి ఫేస్‌బుక్‌లో కనీసం 25,000 మంది ఫాలోవర్లు ఉండాలనీ లేదంటే కనీసం వాళ్ల పేరుతో సృష్టించిన ఫేస్‌బుక్‌ పేజీకి 25,000 లైకులన్నా ఉండాలనీ అమిత్‌ షా పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో, ఫేస్‌బుక్‌ ఖాతా సదరు నేతల విజయావకాశాలను మెరుగుపరుస్తుందని అమిత్‌ షా అభిప్రాయం కావచ్చు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేతలంతా ఇప్పడు సోషల్ మీడియాలో తమ ప్రాభవాన్ని పెంచుకునే పనిలో పడ్డారట. వారిలో చాలామందికి అసలు ఫేస్‌బుక్‌ ఖాతానే లేకపోవడంతో, ఇదెక్కడి కొత్త తంటరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. పోనీ ఫేస్‌బుక్‌ ఖాతా లేకపోయినా ఫర్వాలేదు... ట్విట్టర్లో ఓ పాతికవేలమందిని ఆకర్షించండి చాలు అని సాటి బీజేపీ నేతలు సలహా ఇస్తున్నారట! ఏ రాయి అయితే ఏం!

google-ad-img
    Related Sigment News
    • Loading...