అమరావతికి బిట్స్ పిలానీ
posted on: Jan 31, 2026 11:30AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బిట్స్ పిలానీ రానుంది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ తన నూతన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తుళ్లూరు మండలంలో మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాల స్థలంలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది.
బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీసీఆర్డీయే మధ్య భూ విక్రయ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీఆర్డీఏ ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ డేవిడ్ రాజు, బిట్స్ పిలానీ డిప్యూటీ రిజిస్ట్రార్ వి.వి.ఎస్.ఎన్. మూర్తి పత్రాలపై సంతకాలు చేశారు. ఇక అమరావతిలో నిర్మించనున్న క్యాంపస్ ను బిట్స్ పిలానీ యాజమాన్యం అత్యాధునిక హంగులతో మూడు దశల్లో నిర్మించడానికి నిర్ణయించింది.
కాగా 2027 విద్యా సంవత్సరం నుంచే అమరావతిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంత చేయనున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన కోర్సులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయని బిట్స పిలానీ వర్గాలు తెలిపాయి.






