బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... హాఫ్ బాయిల్డ్ ఎగ్ తినొద్దు
posted on: Feb 11, 2026 3:10PM

తమిళనాడు రాష్ట్రాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు హాప్ బాయిల్డ్ ఎగ్ తింటే అనారోగ్యానికి గురవుతారని, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు హాఫ్ బాయిల్డ్ తినొద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం సూచించారు. ఓమండూరార్ ప్రభుత్వ బహుళ ప్రయోజనాల ఆస్పత్రిలో హృద్రోగులకు అంతర్జాతీయస్థాయి వైద్య సదుపాయాలను కల్పించే దిశగా రూ.8 కోట్లతో ఏర్పాటు చేసి క్యాథ్ల్యాబ్ను ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల అడయార్ పరిసర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా కాకులు మృతి చెందటానికి బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణమని కేంద్రప్రభుత్వం ప్రకటించిందని, దీంతో రాష్ట్రంలో ఆ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఫారం కోడి మాంసాన్ని బాగా ఉడికించే తినాలని, అదే విధంగా కోడిగుడ్డు కూడా బాగా ఉడికించి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలోనూ హాఫ్బాయిల్డ్ జోలికి వెళ్లకూడదని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా రోజురోజుకూ హృద్రోగుల సంఖ్య అధికమవుతుండటంతో రాష్ట్రంలో హృద్రోగంతో బాధపడుతున్నవారికి మెరుగైన చికిత్సలందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో క్యాథ్ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓమండూరార్ ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ ఏర్పాటు చేశామని, దీనితో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాథ్లాబ్ల సంఖ్య ఏడుకు పెరిగిందన్నారు.






