ఈసారి ఆసియా కప్ లేనట్లేనా?
posted on May 19, 2025 3:20PM
.webp)
పాకిస్తాన్ కు భారత్ మరో షాక్
త్వరలో జరగాల్సిన ఆసియా కప్ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ నిర్ణయం?
భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు మరో షాక్ తప్పేటట్టు లేదు. త్వరలో జరగాల్సిన ఆసియా కప్ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్లో పాక్పై ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈసారి ఆసియా కప్ భారత్లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్లే. ఈ మ్యాచ్ లు జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్ లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డుకు పీసీబీ చైర్మన్ మోహ్సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలను మోహ్సీన్ చేపట్టారు. ఇక భారత్ నిర్ణయంతో పాక్కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.