Latest News
భద్రాచలం రాములోరి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
posted on: Mar 27, 2026 1:54PM

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాచలం విచ్చేసి రాములోరి కల్యాణాన్ని తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా సాగింది.
కాగా తన భద్రాచలం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనుల కోసం రూ. 586 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ఈ ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంచింది. అందులో భాగంగా మొదటి దశ పనులకు రేవంత్ రెడ్డి శుక్రవారం (మార్చి 27)భూమిపూజ చేశారు. .


.webp)
.webp)


