బెంగళూరులో 11 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!

posted on: Jun 10, 2026 12:23PM

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ప్రయాణం అంటేనే గుర్తొచ్చేది గంటల తరబడి సాగే ట్రాఫిక్ జామ్‌లు. ఈ ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక భారీ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. నగరంలో తూర్పు, దక్షిణ ప్రాంతాల మధ్య వాహనాల రద్దీని తగ్గించేందుకు ఏకంగా 11.62 కిలోమీటర్ల పొడవైన సరికొత్త, ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (B-SMILE) రూపొందించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రకారం, ఈ భారీ ఫ్లైఓవర్ నగరంలోని అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే ప్రాంతాల గుండా సాగనుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఎజిపుర ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన 11 కొత్త ఫ్లైఓవర్లలో ఇది అత్యంత కీలకమైనదిగా నిలిచింది.

ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ రూట్ మ్యాప్ వాహనదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇది ఇందిరానగర్‌లోని 80 ఫీట్ రోడ్, సీఎంహెచ్ (CMH) రోడ్, 100 ఫీట్ రోడ్ మీదుగా ప్రయాణించి మడివాళ వైపు సాగుతుంది. ఈ మార్గంలో ఓల్డ్ మద్రాస్ రోడ్డుతో పాటు మడివాళ జంక్షన్ వద్ద ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన రోటరీ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఇందిరా గేట్ మరియు పాత కేఎఫ్‌సీ (KFC) సిగ్నల్ వద్ద రెండు 90-డిగ్రీల మలుపులను ప్లాన్ చేశారు. అలాగే, డోమ్లూరు ఫ్లైఓవర్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు సులువుగా వెళ్లేందుకు ఒక ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి హోసూర్ రోడ్డు మీదుగా సాగి, బెంగళూరులోనే అత్యంత రద్దీగా ఉండే ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద మెట్రో లైన్‌తో కలిపి దీనిని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా  రూపాంతరం చెందిస్తారు. హోసూర్ రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్డు మధ్య ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా దీనిని డిజైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ భారీ ప్రాజెక్టుపై స్థానికుల్లో మరియు సిటిజన్ గ్రూపుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 2.4 కిలోమీటర్ల పొడవున్న ఎజిపుర ఫ్లైఓవర్ నిర్మాణం మొదలై దశాబ్దం కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. అలాంటిది, దీనికంటే ఐదు రెట్లు పెద్దదైన 11.62 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్‌ను కేవలం 24 నెలల డెడ్‌లైన్ లోపల ఎలా పూర్తి చేస్తారని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇందిరానగర్ లాంటి అందమైన, పచ్చటి చెట్లున్న వాణిజ్య ప్రాంతాల స్వరూపం పూర్తిగా దెబ్బతింటుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలతో బహిరంగ చర్చ (Public Consultation) జరిపిన తర్వాతే ముందడుగు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్థానికులు సొంతంగా నిధులు సేకరించి ఒక ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌తో దీని ప్రత్యామ్నాయ రూట్‌పై స్టడీ కూడా చేయిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌ను ఇందిరానగర్ మెయిన్ రోడ్ల గుండా కాకుండా సూరంజందాస్ రోడ్  మీదుగా మళ్లిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఏదేమైనా, ఈ భారీ ప్రాజెక్టు నగర ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందనడంలో సందేహం లేదు, కానీ నిర్మాణ సమయంలో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...