Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంజాబ్ పై బెంగళూరు విజయం.. ప్లేఆప్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ
posted on: May 18, 2026 8:57AM
.webp)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనను కొనసాగుతోంది. కింగ్ కోహ్లీ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ,, పంజాబ్ కింగ్స్ పై ఆదివారం (మే 17) జరిగిన మ్యాచ్ లో మరో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. పంజాబ్ పై సునాయాసంగా విజయం సాధించి బెంగళూరు ప్లేఆఫ్ కు దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. కాగా ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా అడుగంటిపోయాయి. ఆదివారం (మే 17) ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో.. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. తొలుత బ్యాటింగ్లో వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలర్లు రాణించడంతో బెంగళూరు ఖాతాలో మరో గెలుపు చేరింది. పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ను భువనేశ్వర్ కుమార్ తన పదునైన బౌలింగ్ తో దెబ్బతీశాడు. ప్రియాన్ష్ ఆర్యను తొలి ఓవర్ లోనే డకౌట్ చేశాడు. ఆ తరువాత రెండు పరుగులు మాత్రమే చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్ ను పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా విఫలం కావడంతో పంజాబ్ ఒక దశలో కేవలం 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో కూపర్ కనోలీ 37 పరుగులు, సూర్యాంశ్ షెడ్గే 35 పరుగులు, మార్కస్ స్టొయినిస్ 37 పరుగులతో ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు. ఆ తరువాత శశాంక్ సింగ్ కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి పంజాబ్ కు గెలుపుపై ఆశలు చిగురింప చేశాడు. కానీ, కీలక సమయంలో రసిఖ్ సలామ్ దార్ అతన్ని ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు, టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆరంభంలోనే 11 పరుగులు చేసిన జాకబ్ బెథెల్ వికెట్ కోల్పోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశారు. దేవదత్ పడిక్కల్ పాతిక బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు 45 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. వీరి తరువాత వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 28 పరుగులతో చెలరేగడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల స్కోరు సాధించింది.






