బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం? నైట్‌క్లబ్ వివాదం తర్వాత రిటైర్మెంట్ షాక్!

posted on: Jun 10, 2026 11:56AM

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెరీర్ ఇప్పుడు ఒక పెద్ద మలుపులో పడింది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 115 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ, ఆ తర్వాత కివీస్ జట్టును 113 పరుగులకే కట్టడి చేసి 27 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఎమిలియో గే హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ 226 పరుగులు చేసి, న్యూజిలాండ్ ముందు 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే 41 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ నాటౌట్‌గా 44 పరుగులు మినహా మిగిలిన వారు రాణించలేకపోవడంతో న్యూజిలాండ్ 138 పరుగులకే కుప్పకూలింది. ఇంతటి అద్భుత విజయం సాధించిన ఆనందం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో ఎంతోసేపు నిలవలేదు.

ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటన ఇంగ్లాండ్ క్రికెట్‌ను కుదిపేసింది. ఈ నైట్‌క్లబ్ వివాదంలో కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు అతని సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్, అలాగే సార్సన్స్ రగ్బీ క్లబ్‌కు చెందిన ఒక ఆటగాడు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన బయటకు రావడంతో 35 ఏళ్ల బెన్ స్టోక్స్‌ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గతంలో 2017లో కూడా బ్రిస్టల్ నైట్‌క్లబ్ వెలుపల ఇద్దరు వ్యక్తులతో జరిగిన ఘర్షణలో స్టోక్స్ చిక్కుకున్నాడు. మళ్లీ ఇప్పుడు అటువంటిదే మరో ఘటన రిపీట్ కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్  బోర్డు (ECB) తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లపై సస్పెన్షన్ మరియు భారీ జరిమానాలతో కూడిన కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఈసీబీ సిద్ధమవుతోంది. ఒకవేళ బోర్డు గనుక చర్యలు తీసుకుంటే, జూన్ 17 నుండి ది ఓవల్‌లో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌తో పాటు, జూన్ 25 నుండి ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌లకు కూడా వీరు దూరం కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ బుధవారం తన వ్యక్తిగత సలహాదారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. బోర్డుతో ఉన్న విభేదాలు, ఈ వివాదాన్ని ఈసీబీ హ్యాండిల్ చేస్తున్న తీరుపై స్టోక్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒత్తిడి కారణంగా ఈసీబీ అధికారిక ప్రకటన చేసే కంటే ముందే, స్టోక్స్ తన సోషల్ మీడియా ద్వారా స్వతంత్రంగా రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2027 వరకు ఉన్న తన సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్ ముగిసే వరకు ఆడాలని అతను భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అతనిని ముందే వీడ్కోలు పలికేలా చేస్తున్నాయి. ఈ వారంలోనే రెండో టెస్ట్‌కు సంబంధించిన జట్టును ప్రకటించనున్న ఈసీబీ, ఒక అత్యవసర బోర్డు సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...