బిచ్చమెత్తుకున్న డబ్బుతో సమాజసేవ

posted on: Jun 16, 2016 2:45PM

కోట్ల రూపాయల డబ్బుండి..ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మనుషులున్న ఈ రోజుల్లో బిచ్చమెత్తుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో సమాజసేవ చేస్తున్నాడు ఒక వృద్ధుడు. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌‌కుళం తాలుకా ఆలంగిణరు గ్రామానికి చెందిన బూల్‌‌పాండియన్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, భార్య మరణించిన తర్వాత వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లలు ఆయన్ను పట్టించుకోకపోవడంతో ముంబైకి వలస వెళ్లిపోయాడు. అక్కడ ఒక దేవాలయంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు. ఎంతైనా కన్నతండ్రి కదా బిడ్డలు కాదన్నా..మమకారం చంపుకోలేక మళ్లీ తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. చాలా రోజుల తర్వాత రావడంతో అన్నీ మరచిపోయి తనను ఆదరిస్తారనుకున్న ఆ పిచ్చి తండ్రికి మళ్లీ పాతకథే ఎదురైంది. పలకరించడం సంగతి పక్కన బెడితే అసలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో పొట్టనింపుకోవడం కోసం యాచకుడిగా మారిపోయాడు.

 

అయితే అతనిలోని మానవత్వం బయటపడే సంఘటన ఒకటి జరిగింది. తూత్తుకుడి జిల్లాలో కొన్ని నెలల కిందట భారీ వర్షాలు కురిసి ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు అండగా నిలబడాలనకున్న బూల్‌పాండి తన వద్ద ఉన్న నగదును అందించాలనుకున్నాడు. అయితే యాచకుడి దగ్గర సాయం పోందేందుకు ప్రభుత్వ అధికారులు నిరాకరించారు. తన డబ్బును సేవా కార్యక్రమాలకే ఉపయోగించాలనుకున్న ఆయన పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు కొనిపెట్టారు. కుంభకోణం, వడక్కు, మాంగుడి, కొత్తంగుడి తదితర ప్రాంతాల్లోని 18 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ సామాగ్రిని అందించారు. ఆయన సేవాభావాన్ని గుర్తించిన విళాంగుడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బూల్‌పాండిని సత్కరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...