శంషాబాద్‌లో నిషేధిత ఇంజెక్షన్ల దందా గుట్టు రట్టు

posted on: May 18, 2026 5:47PM

 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందాను పోలీసులు ఛేదించారు. పశువుల నుండి బలవంతంగా ఎక్కువ పాలు పిండేందుకు ఉపయోగించే ఈ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఒక ప్రధాన నిందితుడిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి సుమారు రూ.50 వేల విలువైన 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మంఖాల్ గ్రామానికి చెందిన అత్తేని కృష్ణ అనే వ్యక్తి డైరీ ఫారమ్ వ్యాపారం చేస్తూ తుక్కుగూడలో “శ్రీకృష్ణ క్యాటిల్ ఫీడ్” పేరుతో పశుగ్రాసం దుకాణం నిర్వహిస్తున్నాడు. 

జీవనోపాధి కోసం ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని అతడు అక్రమ మార్గంలోకి మళ్లించినట్లు విచారణలో తేలింది. సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం గుజరాత్‌కు చెందిన ఖాలెద్ అలీ అలియాస్ చత్రు సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ద్వారా నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెప్ప డంతో కృష్ణ ఈ అక్రమ దందాలోకి అడుగుపెట్టాడు.ఖాలెద్ అలీ నుంచి ఒక్కో బాటిల్‌ను సుమారు 50 రూపాయలకు  కొనుగోలు చేసి, స్థానిక డైరీ ఫారమ్ యజమానులకు 250 నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ ఇంజెక్షన్లను ఉపయోగించి గేదెలు, ఆవుల నుండి బలవంతంగా ఎక్కువ పాలు పిండుతున్నట్లు వెల్లడైంది. తుక్కుగూడకు చెందిన సురేష్ అనే డైరీ ఫారమ్ యజమాని క్రమం తప్పకుండా ఈ ఇంజెక్షన్ల ను కొనుగోలు చేసి తన పశువు లకు వాడుతున్నట్లు కూడా విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఖాలెద్ అలీ మరియు సురేష్ పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసి అత్తేని కృష్ణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మొత్తం 43.250 లీటర్ల పరిమాణంలో ఉన్న 173 ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న సొత్తును పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేశారు.ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకం పశువుల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు తరచుగా ఇవ్వడం వల్ల పశువు ల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తి సహజ గర్భధారణ సామర్థ్యం తగ్గిపోతుంది. 

గర్భాశయంపై ఒత్తిడి పెరగడంతో పాటు మాస్టైటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ ఇంజెక్షన్ లేకుండా పాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ ఇంజెక్షన్లు ఇచ్చిన పశువుల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల చిన్నపిల్లల్లో అకాల యుక్తవయస్సు, పురుషులు మరియు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

గర్భిణీ స్త్రీలకు ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం ప్రమాదం ఉండొచ్చని డిసిపి హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా గుండె సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పులు మరియు కంటిచూపు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో నగర పరిసర ప్రాంతాల్లో నిషేధిత ఇంజెక్షన్ల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డైరీ ఫారమ్‌లలో ఇటువంటి ఇంజెక్షన్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...