Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రూ.232 కోట్ల బ్యాంకు రుణాల మోసం.. రంగంలోకి సీబీఐ..!
posted on: Jul 4, 2026 4:48PM

భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం రూ.232 కోట్లకు పైగా విలువైన రెండు బ్యాంకు మోసాల కేసుల్లో శనివారం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. నిందిత కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలను జల్లెడ పట్టిన అధికారులు కీలక పత్రాలతో పాటు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్స్ బ్రాంచ్ (BSFB)లో నమోదైన మొదటి కేసు ఆర్ఎల్ జ్యువెల్స్ లిమిటెడ్కు సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నేరపూరిత కుట్ర పన్ని బ్యాంకుకు రూ.103.58 కోట్ల నష్టం కలిగించినట్లు సీబీఐ ఆరోపించింది.
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేయడంతో పాటు ఇతర బ్యాంకుల ఖాతాల ద్వారా నిధులను మళ్లించడం, ఖాతాల రికార్డులను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మరో కేసు అశాపురా గార్మెంట్స్ లిమిటెడ్కు సంబంధించినది. కానరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియాన్ని మోసం చేసి రూ.128.23 కోట్ల నష్టం కలిగించినట్లు సంస్థ డైరెక్టర్లు, మరికొందరిపై కేసు నమోదు చేశారు. వస్త్ర పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలను ఉక్కు, అల్యూమినియం, బొగ్గు వ్యాపారాలకు మళ్లించి నిధులను దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ రెండు కేసులకు సంబంధించి నిర్వహించిన సోదాల్లో నిధుల మళ్లింపుకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఇతర దర్యాప్తుకు ఉపయోగపడే ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. నిధుల ప్రవాహం ఎలా సాగింది? మోసంలో ఇంకెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారీ ఆర్థిక అక్రమాల వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.






