మీడియా అత్యుత్సాహామే 20 మంది ప్రాణాలు తీసిందా..?

posted on: Jul 3, 2016 4:50PM

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌లో ఉగ్రవాదులు 20 మంది విదేశీయుల్ని ఊచకోత కోసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి ప్రధాన కారణం స్థానిక మీడియా అత్యుత్సాహామే అన్న వాదనలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తెలిపారు. మీడియా ఆ వార్తలను ప్రత్యక్ష ప్రసారం చేసి ఉండకపోతే చాలా వరకు ప్రాణాలు నిలబడేవని వ్యాఖ్యానించారు. విదేశీయులు, దౌత్య సిబ్బంది నివసించే పటిష్ట భద్రత గల గుల్షన్‌, దౌత్య కార్యాలయాలు అధికంగా ఉండే ప్రాంతం. అందువల్ల ఇక్కడ మీడియా సంస్థలు తమ తమ ప్రతినిధులతో ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.

 

మొన్న రాత్రి 9.20 ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు "హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌"లోకి  "అల్లా హో అక్బర్" అంటూ నినాదాలు చేస్తూ చొరబడ్డారు. విషయం తెలుసుకున్న మీడియా వెంటనే స్పాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం ప్రారంభించింది. ఈ లోపు ఈ విషయం ప్రపంచానికి తెలిసిపోవడం..భద్రతా దళాలు ఘటనాస్థలికి రావడం వెనువెంటనే జరిగిపోయాయి. రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని లోపలి పరిస్థితిని, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయాన్ని పోలీసులకు, మీడియాకు చెప్పడం ప్రారంభించాడు. ఇంకేముంది మీడియా రెచ్చిపోయింది..అతడు చెబుతున్న విషయాలన్నింటిని ప్రత్యక్ష ప్రసారం చేసింది. భద్రతా సిబ్బంది తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, దానికి సమాధానంగా వారు పెద్ద సంఖ్యలో బలగాలను పంపించడం చకచకా జరిగిపోయింది.

 

ఈ పరిణామాలన్నింటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలుసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ హెడ్ క్వార్టర్స్ నుంచి లోపలున్న వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వచ్చారట. అదనపు బలగాలు తమను చుట్టుముడుతున్నాయని వారికి తెలిసిందో అప్పటి నుంచి రెస్టారెంట్‌లోని వారిని బందీలుగా పట్టుకోవాలనే ఆదేశాలను ఇస్లామిక్ స్టేట్ అధినాయకత్వం అందించింది. దీంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. స్థానికులతో కలిపి 60 మంది వరకూ బందీలుగా పట్టుబడటంతో భద్రతా దళాలు ఎలాంటి చర్య తీసుకోలేకపోయాయి. మీడియా ప్రత్యక్ష ప్రసారాలు చేయకుండా ఉండి ఉంటే ఉగ్రవాదులకు బయట జరిగే సమాచారం తెలిసి ఉండేది కాదు. భద్రతా దళాలు ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ఆపరేషన్‌ను ముగించేవేమో..ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. ఇలా తెలుసుకునే వారిలో ఉగ్రవాద నాయకులు కూడా ఉంటారు. ఇలాంటప్పుడు మీడియా ఎంతో ఆలోచించి ప్రసారాలను చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీడియా చేసే ప్రసారాలకు సార్థకత ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...