మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ...తల్లి సంచలన వ్యాఖ్యలు
posted on Nov 9, 2025 4:50PM
.webp)
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తన కుమారుడి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది జూన్ 6, 8 మిస్టరీగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతే మరణవార్త బయటపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్తో కలిసి మహానంద కుమారి మీడియాతో మాట్లాడారు. ‘గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా చూడటానికి సమయం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ తమకు కనీసం సమాచరం ఇవ్వలేదని ఆమె అన్నారు. తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు, చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిషిర సూచన మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు.
అయితే, కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కిడ్నీ మార్పిడి తర్వాత డాక్టర్లు సరైన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్లో జాప్యం చేశారని మహానంద కుమారి ఆరోపించారు. అంతేకాకుండా గోపీనాథ్కు కేటాయించిన గన్మెన్లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన కోడలు సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. గోపీనాథ్ 3 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి తల్లిగా సమయం ఇవ్వలేదన్నారు. ఒక్క అటెండర్ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్తో సునీత వివాహం చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్లో మా పేరు లేదు. కేటీఆర్ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చామని తెలిపారు.