బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం నిషేధం...సుప్రీం కీలక తీర్పు

posted on: May 19, 2026 3:10PM

 

విచ్చలవిడిగా దాడి చేస్తూ, ప్రజలకు ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీధి కుక్కలను రోడ్లు, బహిరంగ ప్రదేశాల నుంచి పూర్తిగా తొలగించాలంటూ 2025 నవంబర్‌లో తాము ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీం కోర్టు స్పష్టంగా నిరాకరించింది. కుక్కల దాడుల భయం లేకుండా ప్రశాంతంగా జీవించే హక్కు దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసిన న్యాయస్థానం.. ఈ విషయంలో ప్రభుత్వాలు కేవలం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోలేవని చెప్పింది. అలాగే రేబిస్ సోకిన కుక్కల కారుణ్య మరణానికి కూడా అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు  త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

ముఖ్యంగా వీధి కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన తర్వాత వాటిని తిరిగి పాత ప్రాంతాల్లోనే వదిలేయాలన్న జంతు హక్కుల కార్యకర్తల వాదనను కోర్టు తోసిపుచ్చింది. కుక్కలను వేరే ప్రాంతాలకు తరలిస్తే అవి అయోమయానికి గురై మరింత హింసాత్మకంగా మారతాయని ఎన్‌జీఓలు వాదించాయి. అయితే ఈ వాదనలతో విభేదించిన ధర్మాసనం.. దేశంలో చిన్నారులు, వృద్ధులు, అంతర్జాతీయ పర్యాటకులు నిత్యం కుక్క కాట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు కేవలం తమ శారీరక బలం మీదో లేదా కుక్కల దయ మీదో ఆధారపడి బతకాలని మన రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని పదునైన వ్యాఖ్యలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కల సంచారం ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఆయా జంతువులను షెల్టర్ హోమ్‌లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది.

ఈ సంక్షోభం ఇంతలా ముదరడానికి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని సుప్రీం కోర్టు మండిపడింది. కుక్కల జనాభా పెరుగుతున్నప్పటికీ.. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను పెంచడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని కోర్టు విమర్శించింది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అరకొరగా చేసిన స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ల వల్ల యానిమల్ బర్త్ కంట్రోల్ లక్ష్యం దెబ్బతిందని ధర్మాసనం పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన నిబంధనలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. 

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు, ఇమ్యునోగ్లోబులిన్స్ మందులు పుష్కలంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ వీధి కుక్కలను పట్టుకునే అధికారులపై ఎలాంటి పోలీస్ కేసులు నమోదు చేయకూడదని చెప్పింది. అంతేకాకుండా రేబిస్ సోకిన, విపరీత ప్రవర్తన కల్గిన కుక్కల కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సూచించింది. 

గత ఏడాది జూలై నవంబర్ నెలల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఆసుపత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్ ప్లేసెస్ నుంచి కుక్కలను తొలగించి షెల్టర్లకు తరలించాల్సి ఉంటుంది. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో వాటికి చికిత్స, టీకాలు అందించాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని కూడా కోర్టు నిషేధించింది. అధికారుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...